తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా దివంగత మాజీ సీఎం కరుణానిధి చిన్నకుమారుడు, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.రాజ్భవన్లో ఉదయం 9 గంటలకు నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ స్టాలిన్తో ప్రమాణం చేయించారు.
తమిళనాడు సీఎంగా ప్రమాణం చేసిన స్టాలిన్ తో మన తెలుగు రాష్ట్రాలకు గొప్ప అనుబంధం ఉందనే చెప్పాలి.ప్రకాశం జిల్లాలో ఆయన పూర్వీకులు ఒంగోలు నగర పరిధిలోని పెళ్లూరులోని వెంకటగిరి రాజుల ఆస్థాన పరిధిలోని దేవాలయాలకు ఆస్థాన విద్యాంసులుగా పని చేస్తుండేవారు.
ఈ క్రమంలోనే వారికి అక్కడికి అతి సమీపంలోని ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో 150 ఎకరాల భూమిని, పెళ్లూరు చెరువు కింద 20 ఎకరాల మాగాణి భూమిని, చెరువుకొమ్ముపాలెంలో నివాసం ఉండేందుకు భూమిని ఇచ్చినట్లుగా ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు.
వెంకటగిరి రాజుల వారసులు ఇప్పటికీ ఈ గ్రామంలో ఉన్నారు.
వారు మాత్రం డీఎంకే అధినేత, దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి తాతల కాలంలోనే పంటలు పండక కరువు కాటకా వల్ల చెన్నపట్నంకు వలస వెళ్ళినట్లు తమ పూర్వీకులు చెబుతుండేవారని పేర్కొంటుంటారు.అయితే అలా వెళ్ళిన కరుణానిధి చివరకు ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలగడం తమ గ్రామానికి గొప్పతనంగా వారు చెబుతుంటారు.
భూములు ఇప్పటికీ ఉన్నా వారు ఎప్పుడు కూడా వచ్చిన దాఖలాలు లేవని చెబుతూ కరుణానిధి కుమారుడు మరలా స్టాలిన్ సీఎం కావడం తమకు గర్వంగా ఉందని పేర్కొంటున్నారు.కరుణానిధి ఏలూరులో జరిగిన ఒక సాహిత్య సభలో ఈ అంశాన్ని ప్రస్తావించాడని, ఒంగోలులో జరిగే సాహిత్య సభకు కూడా త్వరలోనే వస్తానని చెప్పారని, స్టాలిన్ను కూడా ఒకసారి జిల్లాకు రావాలని కోరడం జరిగిందని, అయితే ఆయన రాలేకపోయారంటూ నాయీ బ్రాహ్మణులు పేర్కొంటున్నారు.
ఏదేమైనా తెలుగువాడు, అందులోను మన ఒంగోలు వాసి తమిళనాట మరో సీఎం కావడం జిల్లావాసులకు కూడా గర్వ కారణంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.