జనసేన రాజకీయంపై మొదటి నుంచి అందరికీ అనేక అనుమానాలు ఉంటూనే వచ్చాయి.ఆ పార్టీలో చేరిన చాలా మంది నాయకులు ఆ తర్వాత తాము ఆ పార్టీలో ఉండలేము అంటూ బయటకు వెళ్లిపోయారు.
అలా వెళ్లిన వారు ఎవరూ మళ్లీ వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించలేదు.ఇక ఆ పార్టీలో పవన్ తర్వాత ఆ స్థాయిలో జనాల్లో ఇమేజ్ సంపాదించుకున్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి లక్ష్మీనారాయణ అలియాస్ జెడి లక్ష్మీనారాయణ జనసేన పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేశారు.దాదాపు గెలుపు దగ్గరగానే ఆయన వచ్చి ఓటమిపాలయ్యారు.
రెండున్నర లక్షలకు పైగా ఓట్లను సంపాదించుకుని జనాల్లో జెడి కి ఉన్న క్రేజ్ ఏంటో చూపించారు.ఇక ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత చాలాకాలం ఆ పార్టీలోనే ఉంటూ, సొంతంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ తన ఇమేజ్ ను పెంచుకుంటూ వచ్చారు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని చెబుతూ, జేడీ జనసేన నుంచి బయటకు వెళ్లిపోయారు.రాజకీయంగా మౌనంగా ఉంటూనే సొంత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు.
బిజెపి, టీడీపీలో చేరతారని అంతా చూసినా, ఆయన గ్యాప్ తీసుకుంటూనే వస్తున్నారు.కొద్ది రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను పొగుడుతూ, జేడీ మాట్లాడారు.
దీంతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరిగినా, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీలో చేరే అవకాశం లేదు అని, దీనికి కారణం జగన్ కు జేడీకి మధ్య కేసుల వ్యవహారంలో నడిచిన వైరమే కారణం అని తేలిపోయింది.
అయితే ప్రస్తుతం జనసేన కు ఏపీలో ఆదరణ పెరగడం, విశాఖ నుంచి పోటీ చేసేందుకు జేడీ ప్రయత్నించడం,బలమైన సామాజిక వర్గం అండదండలు ఉండడం, రాబోయే ఎన్నికలలో తాను గెలిచే అవకాశం ఉందని లెక్కలో ఉన్న జేడీ జనసేన వైపు చూస్తున్నారట.
ఆ పార్టీలో చేరి గెలవాలని, అయితే నేరుగా జనసేనలోకి తాను వెళ్లకుండా, పవన్ నుంచి పిలుపు వస్తే అప్పుడు జనసేన లోకి వెళ్లాలని చూస్తున్నారట.మరి జనసేనాని జేడి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో ?
.