ఇప్పడు అందరి చేతిలోనూ ఇమిడిపోతున్న స్మార్ట్ ఫోన్ లో తప్పనిసరిగా వాట్సాప్ ఉంటోంది.ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునే వరకు వాట్సాప్ లో ఏదో ఒక మెస్సేజ్ చదువుతూనే… ఎవరో ఒకరి స్టేటస్ లు చూస్తూనో ఉంటున్నారు జనాలు.
ఫేస్బుక్ కి ఎంత క్రేజ్ ఉందో అంతకంటే ఎక్కువ స్థాయిలో ఇప్పుడు వాట్సాప్ కి కూడా ఆదరణ ఉంది.అందుకే ఈ క్రేజ్ మీద ఆదాయం పొందాలని చూస్తోంది వాట్సాప్.
2014లో 19 బిలియన్ డాలర్లను వెచ్చించి వాట్సప్ను ఫేస్బుక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతానికి వాట్సాప్ లో ప్రపంచవ్యాప్తంగా 1.5బిలియన్లు, భారత్ లో 250 మిలియన్ వాట్సాప్ వినియోగదారులున్నారు.గతంలో సోషల్ మీడియా నెట్ వర్క్ లలో వ్యక్తిగత డేటా లీకేజీ అవుతుందనే ఆరోపణలు వచ్చాయి.
ఆ ఆరోపణల నేపథ్యంలో యాడ్స్ పై దృష్టి సారించని వాట్సాప్ ఇప్పుడు మరోసారి స్టేటస్ లలో యాడ్స్ అంటూ హడావిడి చేస్తోంది.ముఖ్యంగా ఫేస్ బుక్ సంస్థ యూజర్ వ్యక్తిగత డేటాతో భారీగా ఆదాయాన్ని అర్జించింది.
ఆ లావాదేవీలన్నీ ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో ఫేస్ బుక్ పై విమర్శలు వెల్లువెత్తాయి.అధినేత క్షమాపణలు చెప్పేవరకు ఆ వివాదం చల్లారలేదు.
ఇప్పుడు ఆ విషయం గురించి అందరూ మరిచి పోతున్న తరుణంలో మార్క్ జూకర్ బెర్గ్ వాట్సాప్ స్టేటస్ లలో యాడ్స్ డిస్ ప్లే అయ్యేలా సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేస్తున్నట్లు సమాచారం.తద్వారా వాట్సాప్ అధినేతకు, వ్యాపారస్థులకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది.ఈ మేరకు వాట్సాప్ సంస్థ అధికారి డేనియల్స్ కూడా వాట్సాప్ స్టేటస్లో ప్రకటనల అమలుకు సన్నద్ధంగా వున్నట్లు ధ్రువీకరించారు.త్వరలో ఈ ప్లాన్ అమల్లోకి రానుందని చెప్పారు.