స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారంతా ఇప్పుడు వాట్సాప్ ఉపయోగిస్తున్నవారే.చదువుకున్నవారు చదువుకొని వారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇప్పుడు వాట్సాప్ వాడేస్తున్నారు.అయితే ఇప్పుడు ఈ యాప్ ఉపయోగించే వారందరికీ ఓ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.ఎందుకంటే….భద్రతకు సంబందించిన విషయంలో వాట్సాప్ కి ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా అంతర్గత వార్ జరుగుతోంది.దీని కారణంగా ఈ భారత్ లో వాట్సాప్ బంద్ అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టమైన వార్తలు వినిపిస్తున్నాయి.
కంపెనీ వాట్సాప్ మెస్సేజ్ ల గురించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలనేది భారత ప్రభుత్వం వాట్సాప్ కి విధించిన షరతుల్లో కీలకమైనది.దీని ప్రకారం ఏ మెసేజ్ ఎక్కడి నుంచి వైరల్ అవుతోంది ? ముందుగా ఎవరు దానిని పంపించారు అనే విషయం తెలుస్తుంది.కానీ దీనికి వాట్సాప్ మాత్రం ఒప్పుకోవడంలేదు.డిఫాల్ట్ గా తాము ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ వాడుతున్నామని, అందువల్ల తాము కూడా మెసేజ్ లు చదవలేమని ఫేస్ బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ వాదిస్తోంది.
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే మెసేజ్ పంపినవారు, పొందినవారు మాత్రమే ఆ సందేశం చూడగలరు.మిగతావారు దానిని చదవడం సాధ్యం కాదు.మెసేజ్ లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో కనిపెట్టాలన్న ప్రభుత్వ నియమమే ఈ షరతుల్లో క్లిష్టమైనదని వాట్సాప్ కమ్యూనికేషన్ హెడ్ కార్ల్ వూగ్ అన్నారు.
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ లేకపోతే వాట్సాప్ ఎందుకు పనికి రానిదవుతుందని, దానికంటూ ఎలాంటి ప్రత్యేకత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ కారణంగా ప్రభుత్వం ఏ మెసేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడం ప్రభుత్వానికి కష్టంగా మారింది.దీంతో మెసేజ్ ల ద్వారా వ్యాప్తి చెందే పుకార్లను ఎవరు పుట్టిస్తున్నారో, ఎక్కడ పుట్టిస్తున్నారో కనుక్కోవాలని సర్కార్ ప్రయత్నిస్తోంది.వాట్సాప్ యాప్ దుర్వినియోగం చేస్తూ హింస వ్యాపింపజేసే మెసేజ్ లను అడ్డుకొనేందుకు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని ప్రభుత్వం చెబుతోంది.