వాట్సాప్ వినియోగదారులకు మరొక శుభవార్త.ఇకమీదట వాట్సాప్ వాడే వారికి మరో కొత్త అప్షన్ అందుబాటులోకి రానుంది.
అదేంటంటే.త్వరలో ఆరోగ్య బీమా పాలసీలను తీసుకునే సౌలభ్యాన్ని కల్పించనుంది.
ప్రస్తుతం ఫేస్బుక్ యాజమాన్యంలో నడుస్తున్న వాట్సాప్ 2021 లో ఫైనాన్స్, కామర్స్, ఎడ్యుకేషన్, సాంఘిక సంక్షేమానికి తన సేవలను విస్తరించడానికి సిద్ధమవుతోంది.వాట్సాప్ ఆరోగ్య భీమా, మైక్రో పెన్షన్ ఉత్పత్తులను భారతదేశంలో తన మెసేజింగ్ ప్లాట్ఫామ్లో లైసెన్స్ పొందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లేయర్ లతో జతకట్టనుంది.
ఈ ఏడాది చివరి నాటికి వాట్సాప్ ఇన్సూరెన్స్ సేవలను అందుబాటులోకి తేనుంది.అయితే ఆరోగ్యబీమా కోసం ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తో వాట్సాప్ జత కట్టింది.
అలాగే పెన్షన్ సేవల కోసం హెచ్డీఎఫ్సి పెన్షన్స్, పిన్ బాక్స్ సొల్యూషన్స్ తో వాట్సప్ కలిసి పనిచేస్తోంది.మైక్రో రుణాలు, పెన్షన్లు ఇతర ప్రొడక్టుల కోసం వాట్సప్ ఆర్థిక సేవల రంగంలోని భాగస్వాములతో కలిసి పని చేస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది.దేశవ్యాప్తంగా రోజుకు రూ.50 కంటే తక్కువ మొత్తంతో స్వయం ఉపాధి పొందుతున్న 300 మిలియన్ల మందికి పెన్షన్ సదుపాయాన్ని కల్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు వాట్సప్ ఇండియా తెలిపింది.
మొదటి దశ ప్రయోగంలో భాగంగా తక్షణ మెసేజింగ్ ప్లాట్ఫాం ఎస్బిఐ జనరల్తో కలిసి సాచెట్-హెల్త్ ఇన్సూరెన్స్ కవర్, హెచ్డిఎఫ్సి పెన్షన్ను ప్రారంభించడానికి జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పిఎస్) యాప్ ద్వారా సేవలను అందించబోతున్నట్లు భారత వాట్సాప్ అధిపతి అభిజిత్ బోస్ బుధవారం ఫేస్ బుక్ ఫ్యూయల్ ఫర్ ఇండియా 2020 కార్యక్రమంలో వెల్లడించారు.ఇప్పటికే దాదాపు 20 మిలియన్ల మంది వినియోగదారులకు వాట్సాప్ పేమెంట్ సేవలు అందించేలా నవంబర్లో అనుమతులు కూడా వచ్చాయి.అందుకోసం వాట్సాప్ కొన్ని బ్యాంకులతో జత కట్టిన విషయం తెలిసిందే.ఇదే నేపథ్యంలో త్వరలో బీమా సేవలు కూడా వాట్సాప్ లో అందుబాటులోకి రానున్నాయి.