తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రెండవ సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీ అధినాయకత్వం ఒంటెద్దు పోకడలు పోతుందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.టీఆర్ఎస్ పార్టీలో పలువురు ఎమ్మెల్యేలు మరియు నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, పార్టీ కార్యక్రమాలు మరియు ప్రభుత్వ కార్యక్రమాల్లో తమను కూరలో కరివేపాకులా తీసేస్తున్నట్లుగా విమర్శలు చేస్తున్నారు.
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో కూడా తమను భాగస్వామ్యం చేయడం లేదు అంటూ కొందరు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో కేవలం ఒకే కుటుంబం మాట చెల్లుబాటు అవుతుందని, అంతకు మించి ఏం జరగడం లేదు అంటూ స్వయంగా టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
కొందరు మంత్రులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఎమ్మెల్యేలు మరియు మంత్రులపై పార్టీ అధినాయకత్వం ఒక కన్నేసి ఉంచడంతో పాటు పలు విధాలుగా గూఢచర్యం నిర్వహిస్తున్నట్లుగా టీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
సీఎం మాత్రమే కాకుండా పార్టీలోని మరో ఇద్దరు ముగ్గురు మాత్రమే మొత్తం అన్ని మంత్రుల పోర్ట్ పోలియోలపై అజమాయిషీ చేస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.కాని కొందరు టీఆర్ఎస్ నాయకులు మాత్రం ఓపెన్గా మాట్లాడుతూ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నారు.