జనసేన పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి అధికారం దర్శించుకుని స్థాయి వరకు తీసుకు వెళ్లే విధంగా కార్యచరణ రూపొందించుకున్నాడు.
సభలు, సమావేశాలు, ధర్నాలు పోరాటాలు ఇలా ఎన్నో రకాలుగా జనాల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.దీనికి ప్రజల నుంచి కూడా మద్దతు బాగానే వస్తోంది.
కానీ సొంత పార్టీ నేతల నుంచి మద్దతు దూరం అవుతుండడంతో పాటు వారు పవన్ కు దూరంగా జరుగుతుండడం అందరిని ఆలోచనలో పడేస్తోంది.మొదటి నుంచి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ వాయిస్ మాత్రమే వినిపిస్తూ వస్తోంది.
ఆ పార్టీ తరఫున ఏం మాట్లాడాలి , ఏ విధమైన నిర్ణయాలు ప్రకటించాలన్నా పవన్ మాత్రమే మాట్లాడుతున్నారు.ఆ పార్టీ నేతలు ఎవరికీ ఆ అవకాశం దక్కడం లేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయం చెందినా తమకు ఒక్క సీటు దక్కిందనే సంతృప్తి జనసేన లో ఉండేది.కానీ ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా జనసేన కు దూరంగా ఉంటూ వైసిపి ప్రభుత్వానికి అనుకూలంగా జగన్ మెచ్చుకుంటూ పార్టీకి షాక్ ఇస్తున్నారు.అవకాశం దొరికినప్పుడల్లా సొంత పార్టీపై సెటైర్లు వేసేందుకు కూడా రాపాక వెనకాడడం లేదు.అసలు ఆయన పార్టీలో ఉంటారా వెళ్ళిపోతారా అని విషయం కూడా అర్ధం కావడంలేదు.
నిన్న కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు దీక్ష చేపట్టారు.దీనికి జనసేన లో చాలామంది కీలక నాయకులు డుమ్మా కొట్టారు.
ముఖ్యంగా కాకినాడ సమీపంలో ఉండే రాజోలు నియోజక వర్గానికి చెందిన సొంత ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హాజరు కాకపోవడం పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది.అంతకు ముందు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని, తప్పనిసరిగా అమరావతి వెళ్లాల్సి ఉంటుంది అని రాపాక క్లారిటీ ఇచ్చారు.
కానీ అంతకుముందే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.అయితే ఇది జనసేనకు వ్యతిరేకమే.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడాన్ని జనసేన తరపున పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు.ఆ సంగతి పక్కన పెడితే జనసేన పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న మాజీ సిబిఐ జెడి వి.వి లక్ష్మీనారాయణ ఈ సభకు హాజరు కాలేదు.గతంలోనే లక్ష్మీనారాయణ రైతు సమస్యలపై రాష్ట్రమంతా పర్యటన చేశారు.
అనేక సమావేశాలు నిర్వహించారు.ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత రైతులు వెంట ఆయన తిరిగారు.
అటువంటి లక్ష్మీనారాయణ రైతు సౌభాగ్య దీక్ష పేరుతో సొంత పార్టీ చేపట్టిన కార్యక్రమానికి హాజరు కాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.కనీసం ఆయన తన సోషల్ మీడియా ద్వారా అయినా స్పందించి ఉంటే ఎవరికి ఏ అనుమానాలు వచ్చేవి కావు.
ప్రస్తుతం జనసేనలో ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది.వెళ్ళిపోయే నేతలంతా జనసేనాని మీదే ఓ రాయి వేసి వెళ్తున్నారు.
ఇది ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.