ఏపీ రాజధాని అమరావతి విషయంలో చాలా రోజులుగా రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయి.టీడీపీ హయాం లో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రాజధాని పనులు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత డైలమాలో పడ్డాయి.
అసలు ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిలో ఉంటుందా మరో చోటుకి తరలుతుందా అనే విషయంలో ఎవరూ ఏ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.అసలు రాజధాని మార్పు అనే తుట్టుని కదిపింది వైసీపీ.
ఈ విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ రకరకాల ప్రకటనలు చేస్తూ గందరగోళ పరిస్థితికి కారణం అయ్యారు.కాకపోతే ఈ విషయంపై ఇప్పటి వరకు సీఎం జగన్ ఎక్కడా ఏ విధమైన ప్రకటన చేయకుండా మౌనంగా ఉండిపోయారు.
ఈ విషయంపై జగన్ నోరు విప్పి ఏదో ఒకటి చెప్పాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.కానీ జగన్ వైపు నుంచి ఒక్క మాట కూడా రాజధానిపై మాట్లాడ్డం లేదు.
అసలు ఈ విషయంలో ప్రభుత్వం పై విమర్శలు పెరిగిపోతున్న నేపథ్యంలో జగన్ ఈ విషయంపై ఎలా ముందుకు వెళ్తారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.
తాజాగా రాజధాని విషయంపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో రాజధాని పై వైసీపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోందో అర్ధం అవుతోంది.రాజధానిని అమరావతి నుంచి మారుస్తాం అని ప్రభుత్వం అధికారికంగా, బహిరంగంగా ప్రకటించే అవకాశం లేదు.అలా అని చంద్రబాబు ఎంపిక చేసిన ప్రాంతంలో కొత్త నిర్మాణాలు కూడా చేపట్టే అవకాశం కూడా కనిపించడంలేదు.
గత టీడీపీ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకున్నతాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం మినహా మరే కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు వైసీపీ ఇష్టపడకపోవచ్చు.అలాగే ఇదే సమయంలో రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు తరలిస్తారన్న ప్రతిపక్షాల ప్రచారం కూడా నిజమయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు.
దీనికి కారణం అమరావతి నుంచి దొనకొండకు రాజధాని మారుస్తామని ప్రకటిస్తే వైసీపీ నేతలు అక్కడ భూములు కొనుక్కున్నారు కాబట్టి దొనకొండకు తీసుకెళ్తున్నారని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే అవకాశం ఉండడంతో ఆ విధంగా ముందుకు వెళ్లే ఛాన్స్ అయితే కనిపించడంలేదు.
దీనికి పరిష్కారంగా అమరావతిలో కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా కొత్తగా చేసే నిర్మాణాలను, వచ్చే పరిశ్రమలను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేస్తే ఆయా జిల్లాల్లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తద్వారా విమర్శలు తగ్గుతాయని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందట.ఒకవేళ రాయలసీమలో ఏదైనా సంస్థనే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే అమరావతిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసే అవకాశం టీడీపీకి ఉండదు.అలా చేస్తే రాయలసీమ ప్రాంతంలో టీడీపీకి ఇంకా దెబ్బ.
ఒకవేళ విశాఖలో ఏదైనా సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే దాన్ని వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్రలో టీడీపీకి నష్టం.కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే చాలు అమరావతి గురించి ప్రజలకు ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం ఉండదని జగన్ భావిస్తున్నారట.
అమరావతిలో కొత్తగా నిర్మాణాలు చేపట్టకపోతే ఇక అక్కడ రాజధాని ఏర్పాటు సహజంగానే శాశ్వతంగా ఆగిపోయే అవకాశం ఉంటుంది.అందుకే అమరావతి విషయంలో జగన్ ఈ విధంగా ప్లాన్ చేసినట్టు అర్ధం అవుతోంది.