రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది ముమ్మాటికీ నిజం.ఎప్పుడు ఎవరెవరు తిట్టుకుంటారో ఎవరెవరు కలిసిపోతారో ఎవరికీ అర్ధం కానీ పరిస్థితి ఇక్కడ ఉంటుంది.
ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ రాజకీయంగా బాగా వెనకబడి ఉండడం, భవిష్యత్తులోనూ అధికారం దక్కించుకునే స్థాయిలో బలపడే అవకాశం లేకపోవడంతో ఇప్పుడిప్పుడే ఏపీలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన ఆలోచన చేస్తోంది.ఈ మేరకు ఇప్పటికే బీజేపీ నుంచి కూడా జనసేనకు ఆఫర్ లు అందాయి.
ఇది ఇలా ఉంటే బీజేపీ- జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేదానిపైనే ఇప్పుడు అందరి ఆలోచనా ఉంది.
ఏపీలో వైసీపీ 175 స్థానాలకు గాను 151 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుని రికార్డు సృష్టించింది.ఈ మెరుగైన ఫలితాలు రావడం వెనుక జగన్ కృషి చెప్పలేనిది.పాదయాత్ర, నవరత్నాల పథకం ఇలా ఎన్ని అంశాలు వైసీపీ ని అధికారం వైపు నడిపించాయి.
అయితే దీనిలో బీజేపీ సహాయ సహాకారాలు కూడా మర్చిపోలేనివే. అందుకే ప్రస్తుతం బీజేపీ తన స్టాండ్ మార్చుకుని మరీ వైసీపీ మీద విమర్శలు చేస్తున్నా బీజేపీ పార్టీని ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉన్నారు.
కానీ బీజేపీ ఏపీ నేతలు మాత్రం జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని మరీ విమర్శల డోసు పెంచేయడం వైసీపీ నాయకులకు మింగుడుపడడంలేదు.
ఇప్పటివరకు బీజేపీ తో సన్నిహిత సంబంధాలు కొనసాగించి వైసీపీని కాదని జనసేనతో బీజేపీ ముందుకు వెళ్తే అప్పుడు జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది.
ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది అర్ధంకాకుండా ఉంది.జగన్ కు మోదీకి ఎటువంటి అనుబంధం ఉందో, వ్యక్తిగతంగా మోదీతో తనకు మంచి సన్నిహితం ఉందని అనేక సందర్భాల్లో పవన్ ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో జనసేన, బీజేపీ పొత్తు కనుక ఖరారు అయితే ఆ తరువాత తీసుకోవలసిన రాజకీయ నిర్ణయాలు ఏంటి అనేదాని మీద వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.బీజేపీ అండ చూసుకుని పవన్ పార్టీ నేతలు వైసీపీ మీద చెలరేగిపోయే అవకాశం ఉందని, అప్పుడు పవన్ దూకుడుకు అడ్డుకట్ట ఎలా వేయాలనే దానిపైన ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలని జగన్ పార్టీలోని కొంతమంది కీలక నాయకులను ఆదేశించినట్టు తెలుస్తోంది.