మరోసారి కాంగ్రెస్ కు భంగపాటు ఎదురయింది.మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా పరాజయం చెందింది.ముందు నుంచి ప్రధాన పోటీ అంతా టిఆర్ఎస్ బిజెపి అన్నట్లుగానే సాగడం, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ కాంగ్రెస్ దక్కించలేకపోవడం వంటివి రాబోయే సార్వత్రికి ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం చూపిస్తాయి.2014 సార్వత్రికి ఎన్నికల నుంచి కాంగ్రెస్ కు వరుస ఎదురు దెబ్బలే తగులుతున్నాయి.2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కు కాస్తో కూస్తో సీట్లు దక్కినా… టిఆర్ఎస్ కు ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ నిలిచినా.ఆ తర్వాత బిజెపి బలం పుంజుకోవడం, టిఆర్ఎస్ కు గట్టి కౌంటర్లు ఇస్తూ ప్రధాన ప్రతిపక్షం తామే అన్నట్లుగా వ్యవహరించడం వంటి కారణాలతో బిజెపి టీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ అన్నట్లుగా పరిస్థితి తయారయింది.
ఇదే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నిరూపించింది.
దీంతో కాంగ్రెస్ 2023 ఎన్నికల్లో ఏ విధంగా గట్టి ఎక్కుతుంది అనే అనుమానాలు అందరిలో ఎదురవుతున్నాయి.
ఇప్పటికే పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు బిజెపి, టీఆర్ఎస్ లో చేరిపోయారు.కొంతమంది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరినా.తమ భవిష్యత్తుపై గందరగోళంగా ఉన్నారు.తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులకు కొదవలేదు.ఎన్నికల వ్యూహాల్లో నూ ఆరితేరిన వారు ఎంతోమంది ఉన్నారు.అయితే వారంతా ఏదో ఒక అసంతృప్తితో పార్టీ అధిష్టానం పై గుర్రుగా ఉంటూ తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు అనే అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు.
ఇక వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను కోల్పోతుండడం, ముందు ముందు ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది.మునుగోడు అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే రాహుల్ తెలంగాణలో తన యాత్రను చేపట్టారు.ఇప్పుడు ఆయన తెలంగాణలో ఉండగానే ఎన్నికల ఫలితాలు వెలువడి కాంగ్రెస్ కు పరాభవాన్ని మిగిల్చాయి.
కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే బలం పంచుకుంటుంది అనుకుంటున్న సమయంలో ఫలితాలు పార్టీని నిరాశపరిచాయి.ఇప్పటికైనా పార్టీ సీనియర్ నాయకులు, జూనియర్లు అంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విషయం పై చర్చించి ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్తే తప్ప తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్ట కట్టలేదనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకులు నుంచి వ్యక్తమవుతున్నాయి.