విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు కీలకమైన నేత.ఆయన ఇటీవల కాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే.ఆ పార్టీ నుంచి గెలుపొంది పార్టీలకతీతంగా విజయకేతనం ఎగురవేశారు.
అటు రాజకీయాల్లో, ఇటు వ్యాపారాల్లోనే కాకుండా సామాజిక పరంగా కూడా గంటా శ్రీనివాసరావు బలమైన నేత.వరుసగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాజకీయాల్లో తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ఈ నేపథ్యంలో ఎందరో నేతలకు ఆయన అండగా ఉంటూ వారిని ముందుకు నడిపించారు.అయితే 2019 ఎన్నికల తరువాత ఏపీలో రాజకీయ పరిస్థితులు ఆటంకంగా మారడంతో గంటా బ్యాచ్కు చెందిన వారిలో కొంతమంది నేతలు వైసీపీలోకి వెళ్లారు.
దీంతో గంటా కూడా పార్టీ మారతారని గతంలో ముమ్మరంగా ప్రచారం జరిగింది.కానీ వైసీపీలో ఒక అగ్ర నేత గంటాను అడ్డుకున్నారని టాక్ నడిచింది.దీంతో గంటా పార్టీ మారకుండా టీడీపీలోనే ఉండిపోయారు.ఇటీవల గంటా మళ్లీ టీడీపీ కార్యక్రమాలకు హాజరవుతూ యాక్టివ్ అయ్యారు.
విశాఖ జిల్లా పర్యటనలో చంద్రబాబు కూడా గంటా ఇంటికి వెళ్లి ప్రస్తుత రాజకీయాలను సీరియస్గానే చర్చించారు.ఈ నేపథ్యంలో వైసీపీలోకి వెళ్లిన గంటా బ్యాచ్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా వైసీపీలో చేరి ఫ్యాన్ నీడన ఉక్కబోత పడుతున్న వారిని తిరిగి టీడీపీ గూటికి రప్పించేలా గంటా చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.అయితే టీడీపీ అధినాయకత్వం ఒకసారి పార్టీ విడిచి వెళ్ళి కష్టకాలంలో నష్టం చేసిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకునేది లేదని ఖరాఖండీగా చెబుతోంది.
కానీ పొత్తులు లేకుండా ఒంటరిపోరు చేయాలంటే బలమైన నేతల అవసరం ఉంటుందని టీడీపీ భావిస్తోంది.దీంతో గంటా బ్యాచ్ను తిరిగి పార్టీలోకి చేర్చుకునే అవకాశాలు లేకపోలేదని పలువురు భావిస్తున్నారు.
విశాఖ జిల్లాలో గంటా అనుచరుడిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు తిరిగి టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది.ఆయన బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో చంద్రబాబు కూడా సుముఖంగా ఉన్నారని.ఆయన పార్టీలోకి తిరిగి వస్తే విశాఖ నార్త్ లేదా యలమంచిలిలో ఓ సీటు కేటాయించాల్సి వస్తుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.అదే విధంగా గంటా బ్యాచ్లో మరో ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రహమాన్ కూడా తిరిగి టీడీపీలోకి వస్తారని టాక్ నడుస్తో్ంది.
ఇదే తరహాలో గాజువాకకు చెందిన మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తితో పాటు గంటా అనుచరుడిగా పేరుపొందిన కాశీనాథ్ వంటి నేతలు కూడా తిరిగి టీడీపీ గూటికి చేరుకుంటారని గంటా వర్గీయులు చెప్తున్నారు.