తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ రాజకీయ ఎత్తుగడలు ఒక పట్టాన ఎవరికీ అర్థం కావు.పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా పరిస్థితులు తనవైపుకు అనుకూలంగా తిప్పుకోవడంలో కెసిఆర్ సిద్ధ హస్తులు.
ఈ విషయం అనేక సందర్భాల్లో బయటపడింది.తాజాగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ ఎన్నికల్లో విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ఎప్పటి నుంచో టిఆర్ఎస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
దీనిలో భాగంగా పట్టణ ఓటర్ల నాడి తెలుసుకునేందుకు మూడు సర్వేలతో కెసిఆర్ రంగం సిద్ధం చేశారు.ఒక సర్వే పార్టీ ముఖ్యనేతల పనితీరు, వారి ఎత్తుగడలను అంచనా వేసేందుకు ఉపయోగిస్తూ ఉండగా , పోలీసు నిఘా విభాగం ద్వారా మరో సర్వే చేయిస్తోంది.
ఈ రెండూ కాకుండా స్వతంత్ర ఏజెన్సీ ద్వారా సర్వే చేయిస్తూ పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.
ఈ మూడు సర్వే పూర్తి అయిన తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో ఉపయోగించాల్సిన వ్యూహాలపై ఒక ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చి దానికి అనుగుణంగా రాజకీయ ఎత్తుగడలను వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ మూడు సర్వేల పనితీరును ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షిస్తున్నారు.ఈ మూడు సర్వేలు నివేదికలు పూర్తిస్థాయిలో అందితే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక అంచనాకు వస్తుందని వీరు భావిస్తున్నారు.ఇప్పటికే ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జనవరి ఏడో తేదీన నోటిఫికేషన్ వెలువడుతుంది.22 న పోలింగ్ జరుగుతుంది.పరిషత్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే విజయం సాధించామో అదే స్థాయిలో మున్సిపల్ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని టిఆర్ఎస్ పట్టుదలతో ఉంది.
అందుకే ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ మరింత బలపడేలా తగిన సూచనలు చేస్తోంది.ముఖ్యంగా ఈ సర్వేల ద్వారా మున్సిపాలిటీల వారీగా ఏ ఏ పార్టీ బలంగా ఉంది ? ఏ పార్టీ బలహీనంగా ఉంది ? అక్కడ టిఆర్ఎస్ బలపడాలంటే ఏంచేయాలి ? కొత్త మున్సిపాలిటీలు పరిస్థితి ఎలా ఉంది ? పార్టీ నాయకులు సమన్వయంతో పని చేస్తున్నారా లేక గ్రూపు తగాదాలతో పార్టీకి నష్టం చేస్తున్నారా వంటి విషయాలను ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ ఆరా తీస్తోంది.వీటన్నిటి పైన పూర్తిస్థాయిలో రిపోర్టులు తమ చేతికి అందితే మరింత పగడ్బందీగా ముందుకు వెళ్లవచ్చని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.
ఈ మేరకు జనవరి 2 వ తేదీన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, రాష్ట్ర కమిటీ, జడ్పీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్పర్సన్లు, ఇతర సీనియర్ నేతల సమావేశాన్ని నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది.