ఆంధ్రలో రాజకీయ మార్పు తీసుకొచ్చి సరికొత్త పరిపాలన అందించడమే లక్ష్యంగా జనసేన పార్టీ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా సక్సెస్ అయ్యాడా లేక ఫెయిల్ అయ్యాడా అనే విషయం మరో కొద్ది రోజుల్లో తేలిపోనుంది.ఈ మధ్య పార్టీ నాయకులతో ఎన్నికల ఫలితాలపై సమీక్ష పెట్టిన పవన్ తమకు సీట్లు ముఖ్యం కాదు అని మార్పు ముఖ్యం అని చెప్పుకొచ్చారు.
అంతకు ముందు తాము అధికారంలోకి రావడం ఖాయం అని పవన్ చెప్పుకొచ్చారు.పవన్ స్టేట్ మెంట్ తో పార్టీ శ్రేణులు కూడా ఇప్పుడు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
తాము అనుకుంటున్నట్లుగా కింగ్ మేకర్ పాత్రకు సరిపడా సీట్లు రావడం లేదనే అంచనాకు ఆ పార్టీ నాయకులంతా వచ్చేసినట్టు తెలుస్తోంది.
దీని ప్రభావమో ఏమో కానీ ఫలితాల రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కౌంటింగ్ ఏజెంట్ల నియామకం, ఫలితాల పర్యవేక్షణ వంటి వాటి గురించి జనసేన వర్గాలు అంతగా ఆసక్తి చూపించడంలేనట్టు తెలుస్తోంది.
ఏపీలో ఫలితాల ప్రకటనకు ఇంకా పదిహేను రోజుల సమయం కూడా లేదు.ఈ ఎన్నికలపై భారీగా ఆశలు పెట్టుకున్న జనసేనలో మాత్రం ఇప్పుడు నిరుత్సాహం కనిపిస్తోంది.పవన్పా తో పాటు పార్టీ కీలక నేతలంతా సైలెంట్ అయిపోయారు.ఎన్నికల్లో జనసేనకు సింగిల్ డిజిట్ తప్పదన్న అంచనాల ప్రభావమో, అధినేత పవన్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్దమవుతున్నాడన్న వార్తల ప్రభావమే తెలియదు కాని జనసేనలో మాత్రం ఓ రకమైన నిస్తేజం కనిపిస్తోంది.
ప్రస్తుతం టీడీపీ, వైసీపీ పార్టీలు ఏదో ఒక విషయంపై హడావుడి చేస్తూ ఉంటే జనసేన ఉలుకు పలుకు లేకుండా ఉంది.ఏపీ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం ఉంటుందని, సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలమని, కింగ్ మేకర్లం కావడం ఖాయమంటూ గట్టిగా చెప్పిన నాయకులంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.అధినేత పవన్ కళ్యాణ్ కు తాము ఐదు పార్లమెంటు సీట్లు, 40 అసెంబ్లీ సీట్లు గెలుస్తున్నామంటూ నివేదికలు ఇచ్చిన వారు ఇప్పుడు పవన్ దరిదాపుల్లో కనిపించడంలేదు.పోలింగ్ ముగిసి ఫలితాలు రాకముందే ఇలా ఉంటే రాబోయే ఐదేళ్లలో తమ పరిస్ధితి ఏమిటని జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థులంతా ఆందోళన చెందుతున్నారు
.