వారసత్వం ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టినా, ఆ తరువాత పరిస్థితుల్లో సొంతంగా పార్టీని స్థాపించి ఇప్పుడు అధికారం చేపట్టే వరకూ, వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ వచ్చిన సంగతి తెలిసిందే.జగన్ వైసీపీ ని స్థాపించిన సమయంలో, అధికారంలో ఉన్న కాంగ్రెస్ జగన్ ను అడుగడుగునా ఇబ్బందులు పెడుతూ, వచ్చినా, వాటన్నిటినీ అధిగమించి పార్టీని బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారు.
తెలంగాణ విభజన తర్వాత ఏపీలో తమకు అధికారం దక్కుతుందని భావించినా, బిజెపి, వైసిపి ,జనసేన కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్లడం, టీడీపీ అధికారం దక్కించుకోవడంతో జగన్ కు నిరాశే ఎదురయ్యింది.అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా, పార్టీని బలోపేతం చేసి, అధికార పార్టీ టిడిపి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎదుర్కుంటూ, ప్రజల్లో బలం పెంచుకుంటూ, నిత్యం పోరాటాలు, ఆందోళనలు చేస్తూ జనంలో తిరుగుతూ వచ్చారు.
పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా కాలినడకన తిరుగుతూ, ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ, పాదయాత్రను సక్సెస్ చేయడం, ఆ తరువాత 2019 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడం, ఇలా ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.అప్పుడే జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది.
అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి నిత్యం ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడం పైనే పూర్తిగా దృష్టి సారించి, ఎక్కడా ఎటువంటి అవినీతి వ్యవహారాలు తలెత్తకుండా, ప్రభుత్వంను ముందుకు నడిపించడంలో జగన్ సక్సెస్ అవుతూ వస్తున్నారు.
కరోనా ప్రభావంతో ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నా, ఏపీలో ఆ ప్రభావం కనిపించకుండా, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడుతున్నా లెక్కచేయకుండా, నిధులను సమీకరించి, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ, కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేసి వాటిని ప్రకటిస్తూ వస్తున్నారు.తనను నమ్మి, ఓటు వేసిన వారి కోసం ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తాను అనే విధంగా జగన్ సంకేతాలు ఇస్తూ, జనాల నమ్మకాన్ని సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు.జనాలకు జగన్ పాలన పై భిన్నాభిప్రాయాలు ఉన్నా, మెజారిటీ ప్రజల్లో మాత్రం సంతృప్తి ఉంది.
ఎందుకంటే ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ అమలు కాకపోవడం, మిగతా రాష్ట్రాలు కూడా జగన్ బాట పడుతూ ఉండడం వంటివి జగన్ పాలన జనరంజకం అనే విషయాన్ని తెలియజేస్తోంది.
ఇదే సమయంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ, అవినీతి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా కట్టడి చేయడంలో జగన్ సక్సెస్ అయినట్లుగానే కనిపిస్తున్నారు.
ఫీజు రియంబర్స్మెంట్, అమ్మ ఒడి, జగనన్న చేయూత, 108, విడతలవారీగా మద్యనిషేధం, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో జనాలు మెచ్చే పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు.అలాగే గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలు వారి ఇంటి ముందుకే అందించే విధంగా ఏర్పాటు చేయడం వంటివి జగన్ కు క్రెడిట్ తెచ్చిపెడుతున్నాయి.
ఇదే సమయంలో రాజకీయ ప్రత్యర్థుల విషయంలో జగన్ కఠినంగా వ్యవహరిస్తున్నారు.
గతంలో తనను, తమ పార్టీని టార్గెట్ గా చేసుకుంటూ, కక్షసాధింపుకు పాల్పడిన నాయకులు ఎవరినీ వదిలిపెట్టకుండా, విమర్శలు చేస్తూ వస్తున్నారు.అలాగే ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా టార్గెట్ చేసుకుని కక్ష సాధిస్తున్నారని,ఆ సామాజిక వర్గం నాయకులు, అధికారులను వేధింపులకు గురి చేస్తున్నారనే విమర్శలను జగన్ మూటగట్టుకుంటూ మొండిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం ఎదుర్కొంటున్నారు.ఇక తనపై సామాజికవర్గం ముద్ర పడకుండా చేసుకోవాలనే ఆలోచనతో మంత్రి మండలితో పాటు వివిధ పదవులను భర్తీ చేసే విషయంలో తన సామాజిక వర్గానికి చెందిన నాయకులను దూరం పెట్టి, మిగతా సామాజిక వర్గాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.
ఈ విషయంలో జగన్ సొంత సామాజికవర్గ నేతలు అసంతృప్తికి గురవుతున్నా, బాహాటంగానే విమర్శలు చేస్తున్నా, జగన్ మాత్రం అవేవీ పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు.తాను కేవలం ఐదేళ్ళ ముఖ్యమంత్రిని కాదని, మరో పది, పదిహేను సంవత్సరాలు ఈ పదవిలో ఉంటాను అని బలంగా జగన్ నమ్ముతూ, ఈ విధంగా వ్యవహారాలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు.