ఏదో ఒక రకంగా ఏపీలో రాజకీయ వేడి పెంచి బలపడాలని బిజెపి ప్రయత్నాలు చేస్తూనే ఉంది.అయినా ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు.
ఈ విషయాన్ని గ్రహించిన బిజెపి నేతలు ప్రత్యేక రాయలసీమ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇటీవలే బిజెపి నాయకుడు రాజ్యసభ సభ్యుడైన టీజీ వెంకటేష్ కర్నూలు రెండో రాజధానిగా ఎంపిక చేయాలని, హైకోర్ట్ ను కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో బిజెపి ప్రత్యేక రాయలసీమ అనే నినాదాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.దీనిలో భాగంగానే త్వరలో ఆ పార్టీకి చెందిన ఎంపీలతో రాయలసీమలో పాదయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇదే విషయమై కొద్ది రోజుల క్రితం కడప లో సమావేశమైన బిజెపి నాయకులు ఈ విషయాల గురించి చర్చించుకున్నారట.ఈ సందర్భంగా రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు.
ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలో సుమారు 50 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని , రాయలసీమ జిల్లాలకు చెందిన వారు ముఖ్యమంత్రులుగా పదవులు చేపట్టినప్పటికీ ఇక్కడ అభివృద్ధి మాత్రం శూన్యం అని జీవీఎల్ విమర్శలు చేశారు.అలాగే రాజధాని విషయంలో ఏ నిర్ణయమైనా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని దీంట్లో లో ఆంధ్ర ప్రభుత్వం జోక్యం ఉండదని జీవీఎల్ చెప్పుకొచ్చారు.ఇక బిజెపి మీ పాద యాత్ర గురించి చెప్పుకుంటే అసలు ఈ పాదయాత్రలో పాల్గొనే నాయకులు ఎవరు అనేది ఆ పార్టీలోనే పెద్ద ప్రశ్నగా మారింది.ఎందుకంటే ప్రస్తుతం ప్రత్యేక రాయలసీమ నినాదాన్ని వినిపిస్తున్న జీవీఎల్ ఏపీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇక ఇటీవల టిడిపి నుంచి బిజెపిలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్ టీజీ వెంకటేష్ వంటి నాయకులను ముందు పెట్టి ఈ పాదయాత్ర జరిపించాల్సి ఉంటుంది.
అసలే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మొగ్గుచూపే బిజెపి ఇప్పుడు ఈ నినాదాన్ని ఎత్తుకోవడం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.పాదయాత్ర సమయంలో ప్రత్యేక రాయలసీమ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్తే ఆ సెంటిమెంట్ ను బీజేపీకి కలిసొచ్చేలా వాడుకోవాలని, అవసరమైతే దాని ఆధారంగా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు దిశగా అడుగులు వేసి బలం పెంచుకోవాలని బిజెపి అగ్ర నాయకులు స్కెచ్ గీస్తున్నారట.అయితే బిజెపి నాయకులు ఆశపడుతున్నట్టుగా ప్రత్యేక రాయలసీమ అంశం కానీ, పాదయాత్ర కానీ సక్సెస్ అవుతుందా లేదా అనేదే చూడాల్సి ఉంది.