ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ అపజయాన్ని చవిచూసిన జనసేన పార్టీ భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడింది.కేవలం ఒక్క సీటుకే పరిమితం అయిపోయిన ఆ పార్టీలో అధ్యక్షుడిగా ఉన్న పవన్ సైతం ఓటమి చెందండం ఆ పార్టీ కార్యకర్తలు ఎవరికీ మింగుడుపడడంలేదు.
ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి జనసేన లో నిస్తేజం అలుముకుంది.పార్టీ అధ్యక్షుడు పవన్ అప్పటి నుంచి పెద్దగా ఎవరికీ టచ్ లోకి రావడమే లేదు.
దీంతో ఆయన కోటరీలోని నాయకులకు, కిందిస్థాయి కార్యకర్తలకు పార్టీ భవిష్యత్తు ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు.పార్టీలో ఉండలేక , అలాగని బయటకు వెళ్లలేక సతమతం అవుతున్నారు.
ఇక పవన్ విషయానికి వస్తే ఆయన పూర్తిగా అజ్ఞాతంలోనే ఉంటున్నారు.సోషల్ మీడియా లో కూడా ఎక్కడా కనిపించడంలేదు.మరోవైపు తమ పార్టీకి మైలేజ్ తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసుకున్న 99 టీవీని కూడా అమ్మకానికి పెట్టేశారట.ఈ నేపథ్యంలో పవన్ ని నమ్ముకుని, జనసేనకోసం కెరీర్ ని త్యాగంచేసి పార్టీలోకి వచ్చిన చాలామంది, జనసేన సీనియర్ నేతల దగ్గర తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట.
ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు ఏంటి ? మేము పార్టీలో ఉండాలా వద్ద ? రాజకీయంగా పుంజుకోవడానికి పవన్ ఏమి చేయబోతున్నారు ? ఇలా సవాలక్ష ప్రశ్నలు వేస్తూ ఆందోళన చెందుతున్నారట.
రోజు రోజుకి ఇటువంటి రాద్ధాంతాలు ఎక్కువయిపోవడంతో పవన్ కోటరీలో నాయకులు ఇదే విషయమై పవన్ దగ్గర పంచాయతీ కూడా పెట్టారట.జనసేన రాజకీయ భవిష్యత్తు ఏంటి ? ఇప్పుడు ఏం చేద్దాం ? భవిష్యత్తులో ఏం చేద్దాం అంటూ కొంతమంది సీనియర్లు పవన్ దగ్గర చర్చ పెట్టారు.కిందిస్థాయి నేతల నుంచి తమపై ఒత్తిడి పెరుగుతోందని కూడా వారు పవన్ కి చెప్పాలని చూశారట.
అయితే ఈ విషయంలో పవన్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారట.పార్టీ అధ్యక్షుడిని కూడా గెలిపించుకోలేని క్యాడర్ తనకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్నట్టుగా మాట్లాడడంతో ఆ చర్చ పెట్టిన సదరు కోటరీ నాయకులు కిమ్మనకుండా బయటకి వచ్చేశారని పార్టీలో ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.