వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్ర చివరి దశకు చేరుకుంది.ప్రస్తుతం ఆయన యాత్ర ఏపీలోని చివరి జిల్లా అయిన శ్రీకాకుళం లో జరుగుతోంది.
జనవరి 5 వ తేదీ నాటికి ఆ యాత్రను ఇచ్ఛాపురం లో ముగించేందుకు సిద్ధం అవుతున్నాడు.ఈ మేరకు అవసరమైతే పాదయాత్ర షెడ్యూల్ లో మార్పులు చేయాల్సిందిగా సంబంధిత నాయకులను జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది.ఆ యాత్ర పూర్తి కాగానే ఇక పూర్తి స్థాయిలో దృష్టంతా పార్టీని ప్రక్షాళన చేసే విషయాల మీదే పెట్టాలని జగన్ నిర్ణయించుకున్నాడు.ముఖ్యంగా… పార్టీలో నాయకుల మధ్య ఏర్పడిన అంతర్గత విభేదాలపై పూర్తి స్థాయిలో దృష్టిసారించి వారి మధ్య సయోధ్య కుదర్చాలని …అయినా మాట వినని నాయకుల మీద వేటు వేయాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఇటువంటి విషయాలను చక్కదిద్దాల్సిందిగా పార్టీ సీనియర్ నాయకులకు అప్పగించినా వారు సరైన రీతిలో పరిస్థితులు చక్కదిద్దలేదు అని జగన్ గ్రహించాడు.దాదాపు ఏడాది కాలంగా పాదయాత్రకు తాను పరిమితం అయినందున ఎవరికి వారు పార్టీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలహీనపరిచారని…ఇటువంటి విషయాలను చూస్తూ వదిలేస్తే మరో సారి అధికారం దూరం అవ్వడం ఖాయం అవుతుందని… ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విధంగా జరగకుండా ప్రక్షాళన చేయాలని జగన్ ఒక అభిప్రాయానికి వచ్చేసాడు.అందులోనూ… తెలంగాణాలో టీడీపీకి ఘోర పరాభవం ఎదురవడంతో… ఏపీలో వైసీపీకి ఈ పరిణామాలు బాగా కలిసి వస్తాయని అందుకే ఈ సమయంలో పార్టీ లో నాయకుల మధ్య ఏర్పడిన అంతర్గత విబేధాలను పరిష్కరించి రాజకీయంగా బలపడాలని జగన్ చూస్తున్నాడు.
అలాగే ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితులపై నివేదికలు తెప్పించుకుంటూ… ఏ నియోజకవర్గంలో ఏ పరిస్థితి ఉంది అనే అంచనాకు వస్తున్న జగన్ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తప్ప చాలా నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో నాయకులు పనిచేయడం లేదనే అభిప్రాయానికి వచ్చాడు.అందుకే పాదయాత్ర ముగిసిన వెంటనే… విజయవాడ కేంద్రంగా నివాసం ఉండి పార్టీ పరిస్థితిని చక్కబెట్టాలని చూస్తున్నాడు.పాదయాత్రలో నిర్విరామంగా పాల్గొనడం వల్ల ఇప్పటివరకు పార్టీలో నెలకొన్న ఈ పరిస్థితులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయానని భావిస్తున్న జగన్ వీలైనంత తొందరగా పాదయాత్రకు ముగింపు పలకాలని కంగారుపడుతున్నాడు.