టిఆర్ఎస్ పార్టీలో కెసిఆర్ తర్వాత కేటీఆర్ ఆ తరువాత కవిత అన్నట్టుగా ప్రాధాన్యం ఉండేది.అయితే అనూహ్యంగా ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె ఓటమి చెందడంతో సైలెంట్ అయిపోయారు.
పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు కనిపించారు.అంతేకాదు కొద్ది నెలలుగా ఎవరికీ అందుబాటులో లేకుండా వ్యక్తిగత పనులకు పరిమితం అయిపోయారు.
కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ జాగృతి పేరుతో కవిత హడావుడి మొదలు పెట్టారు.
మళ్లీ పార్టీలో పునర్వైభవం తెచ్చుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం జాగృతి కార్యక్రమాలను ఇంతగా ప్రమోట్ చేయడం వెనుక కారణం కూడా ఇదే అన్నట్టుగా కనిపిస్తోంది.
రెండేళ్లుగా జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి హాజరుకాని కవిత ఈసారి మాత్రం మొత్తం కార్యక్రమాలు అన్నిటిని తన భుజాలమీద వేసుకున్నారు.జాగృతి కార్యకర్తలు బతుకమ్మ సంబరాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల్లో కవిత టాలెంట్ గురించి మాట్లాడుతూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.అయితే దీని వెనక పెద్ద కారణమే ఉన్నట్టుగా పార్టీలో చర్చ నడుస్తోంది.
కెసిఆర్ ఆదేశాల మేరకే కవిత ఇప్పుడు యాక్టివ్ అయినట్టు, ఆమెకు త్వరలోనే టిఆర్ఎస్ లో కీలక బాధ్యతలు దక్కబోతున్నట్టు ప్రచారం మొదలైంది.
ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు.మొన్నటి వరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యత లు మాత్రమే నిర్వహించిన కేటీఆర్ కు ఆ తరువాత పార్టీ బాధ్యతలతో పాటు మంత్రిగా తన క్యాబినెట్ లో స్థానం కల్పించారు కేసీఆర్.కానీ రెండు పదవులతో కేటీఆర్ బాలన్స్ చేయలేక ఇబ్బడిపడుతున్నారని భావించిన కేసీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి కేటీఆర్ ను తప్పించి కవితకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది.
ఆమె ప్రోటోకాల్ కు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ స్థానం కానీ ఇచ్చే ఆలోచనలో కెసిఆర్ ఉన్నట్టు సమాచారం.దానిలో భాగంగానే ఆమె మళ్ళీ యాక్టివ్ అవుతున్నట్టు కనిపిస్తోంది.