తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికే వర్గ విబేధాలు ముదిరిపోయాయి.ఎవరికి వారే తాము గొప్ప నాయకులం అనుకుంటూ అధిష్టానానికి బెదిరింపులతో కూడిన సంకేతాలు ఇస్తున్నారు.
మరో పక్క చుస్తెర్ అధికార పార్టీ టీఆర్ఎస్ చాపకింద నీరులా తమ ప్రాభల్యం బాగా పెంచేసుకుంటోంది.ఈ దశలో ఆ పార్టీ దూకుడుని ఎదుర్కోవాల్సిన కాంగ్రెస్ ఇంకా ఎవరికీ వారే అన్నట్టు ఉండడంతో మిగిలిని కొద్దీ మంది నేతలు కూడా పక్క పార్టీల వైపు చూస్తూ తమ భవిష్యత్తు వెతుక్కుంటున్నారు.
తాజాగా దానం నాగేందర్ పార్టీకి దూరమయ్యారు.ఆయన పార్టీ మారతారని గతకొంత కాలంగా ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఇటీవల నగర అధ్యక్షుడిగా ఉన్న ఆయన్ను తొలగించి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు బాధ్యతలు అప్పగించారు.దీంతో మరింత అసహనానికి గురైన దానం పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.
ఆయన బాటలోనే మరోనేత ముఖేష్ గౌడ్ కూడా ఉన్నారట.వీరితోపాటు హైదరాబాద్ లో స్థానికంగా మరికొంతమంది నేతలు వలసలకు సిద్ధపడుతున్నారు.దీంతో టి.కాంగ్రెస్ లో ఆందోళన మొదలయ్యింది.జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ లో ఏ కొద్దిమంది నేతలు బయటకు వెళ్ళిపోయినా తీరని నష్టంగానే కనిపిస్తోంది.దాన్నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుందనే పరిస్థతి వచ్చేసింది.
నాయకుడి కన్నా పార్టీ పెద్దది కదా! అలాంటప్పుడు, ఒక నాయకుడు వెళ్లిపోయినంత మాత్రాన.పార్టీ ఎందుకు కుదేలు అవుతోంది అనేదే ప్రశ్నగా మిగిలింది.
కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ ఇప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని నిర్మించుకోలేకపోవడం.కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ద్వితీయ శ్రేణిపై ఏమాత్రం దృష్టి సారించలేదు.క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నా… ఆ పార్టీ రాజకీయాలు కేవలం రాష్ట్రస్థాయి నేతలకే పరిమితమౌతూ వస్తోంది.సభ్యత్వ నమోదు, కార్యకర్తల్ని మొబైల్ ఆప్ లో రిజిస్ట్రేషన్ చేయడం మాత్రమే సరిపోదు.
ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నేతల్ని వలేసి చేర్చుకోవడమే బలోపేత చర్యగా చూస్తున్నారు.అంతేగానీ, కాంగ్రెస్ నుంచి కూడా అలాంటి పేరున్న నేతలు దూరమయ్యే పరిస్థితి ఒకరోజు వస్తుందనే అంశాన్ని వదిలేశారు.
పార్టీని వీడి నాయకులూ వెళ్లిపోతుండడం కొంచెం కంగారు పెట్టె విషయం అయినా.పై స్థాయిలో ఒక నాయకుడు వెళ్లగానే, ద్వితీయ శ్రేణిలో ఉన్నవారికి అవకాశం కల్పించే పరిస్థితి ఉండాలి.
అలాంటి పరిస్థితి ప్రస్తుతం టి.కాంగ్రెస్ లో లేదు.రాబోయే రోజులన్నీ వలస రాజకీయాలే ఉంటాయి.కాబట్టి, పార్టీ బలోపేతం చేయడమంటే ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం కాదు సొంత పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పెంపొందించుకోవాలనే ముఖ్యాంశాన్ని గుర్తించాలి.
అసలే ముందస్తు ఎన్నికలంటూ తెగ హడావుడి మొదలయ్యింది ఈ దశలో పార్టీని పరుగులు పెట్టించడం మానేసి ఉన్న నాయకులను కాపాడుకునే ప్రయత్నాల్లోనే ఇంకా కాంగ్రెస్ పార్టీ మునిగితేలుతోంది.