మేఘాల్లో ఇంధ్ర ధనుస్సు విరిస్తే… ఆకాశంలో కారు తేలియాడితే… నేల మీది చెట్టు కదిలితే … అందరూ విచిత్రంగా చూస్తారు.కొన్నింటిని విన్నా.
చూసినా విచిత్రం అనిపిస్తుంది.ఇలాంటివి కరోనా టీకా వేసుకునే సమయంలో అనేకం తారసపడ్డాయి.
చాలా మంది ముందస్తుగా టీకా కేంద్రాలకు వచ్చి టీకాలు వేసుకున్నారు.మరికొంత మంది టీకా అనగానే ఆమడదూరంలో ఉన్నవారు ఉన్నారు.
మన దేశంలో ఇలాంటి ఘటనలు లేకున్నా పశ్చిమ దేశాల్లో టీకాను వ్యతిరేకించే వారు ఉన్నారు.ఆందోళనలు, నిరసనలు చేస్తుంటారు.వ్యక్తిగతంగా మొండికేసి నానా హంగామా చేసిన వారుంటారు.ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు.
ఈ ఉదంతం కూడా అదే కోవలోకే వస్తుంది.తమిళనాడులోని తిరుపత్తూర్ పురికముని మిట్టకు చెందిన కుడియన్కు అనే వ్యక్తి టీకా వేసుకోవడానికి నానా హంగామా సృష్టించాడు.
అతడికి టీకా వేయటానికి వెళ్లిన సిబ్బంది పడిన ఇబ్బందులు అంతా ఇంతా కాదు.చివరికి స్థానిక సర్పంచ్ రంగంలోకి దిగాడు.
టీకా వేసుకుంటే ఎమైనా అయితే నేనే బాధ్యత తీసుకుంటానని చెప్పే వరకు అనేక ప్రశ్నల వర్షం కురిపించాడు.
తనకు 8మంది పిల్లలు ఉన్నారు.టీకా వేసుకుంటే నాకేమైనా అయితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించాడు.అంతేకాదండోయ్ తన పిల్లల పోషణ మాటేమిటని, నాకు కనీసం ఇల్లు కూడా ఇవ్వలేదని, కుల ధ్రువీకరణ పత్రం కూడా లేదని చెప్పాడు.
షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్ననాకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులంటూ ప్రశ్నలతో సిబ్బందిని ఇబ్బందులకు గురి చేశాడు.దీంతో సర్పంచ్ ఎంట్రీ ఇచ్చి తనదీ బాధ్యత అని చెప్పడంతో టీకా వేసుకున్నాడు.
అయితే ఓ వ్యక్తి టీకా కోసం సిబ్బంది పడిన ప్రయాస ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.