సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ వస్తున్నా రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపించలేని స్థితిలో ఉండిపోయారు వామపక్ష పార్టీ నేతలు.ప్రతిసారి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఆ తరువాత ఆ పార్టీలతో తెగ తెంపులు చేసుకోవడం షరామామూలుగా మారిపోయింది.2019 ఎన్నికల్లో ఇదే విధంగా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం, చాలా చోట్ల పోటీకి దిగడం చేశారు.అయినా వామపక్ష పార్టీలతో పాటు జనసేనానికి కూడా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
ప్రస్తుతం వామపక్షాలు తమ ఉనికిని మరింతగా కోల్పోయాయి.ఇవన్నీ ఇలా ఉంటే ఎన్నికల ఫలితాల తరువాత అయినా గట్టిగా పోరాటాలు చేద్దామని వామపక్షాలు అనుకుంటే పవన్ కళ్యాణ్ తీరు వారికి అంతుపట్టడంలేదు.
పవన్ కు తాము దగ్గరవుదామని భావిస్తుంటే పవన్ దూరం దూరంగా జరుగుతుండడంతో వామపక్ష పార్టీలు గుర్రుగా ఉన్నాయి.
ప్రస్తుతం బీజేపీ వైపు పవన్ చూస్తుండడం వారికీ ఆగ్రహం తెప్పిస్తోంది.ఇటీవల విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ కి కూడా దూరంగానే ఉన్నాయి వామపక్ష పార్టీలు.పవన్ కళ్యాణ్ జై బీజేపీ అంటున్నారు.
ఆయన ఈ దేశానికి మోదీ, అమిత్ షా కరెక్ట్ అంటున్నారు.ఆ ఇద్దరూ ఎవరినైనా తొక్కి పారేస్తారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో కామ్రేడ్స్ కి ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది.ఏపీకి అన్ని విధాలుగా అన్యాయం చేసినా అమిత్ షా ఏ విధంగా కరెక్ట్ అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
పవన్ ఇప్పటికైనా బీజేపీ విషయంలో అసలు నిజాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.ఇప్పటికే వామపక్ష నేతలు మధు, రామకృష్ణ ఈ మేరకు గట్టిగానే పవన్ కు వార్నింగ్ ఇచ్చారు.
జనసేన పార్టీని మరో నాలుగున్నరేళ్ళ పాటు ముందుకు నడిపించాలి.ఇలా చేస్తే పార్టీకి ఎక్కడా బలం లేదు.ఆర్ధికంగా బలమైన నాయకులూ పెద్దగా ఎవరూ లేరు.పార్టీ ఉనికిలో ఉండాలంటే బీజేపీ వంటి పెద్ద పార్టీ అండ అవసరం.పైగా ఏపీలో జగన్ అధికారంలో ఉన్నారు.ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ వంటి జాతీయ పార్టీ అండదండలు ఉంటే తప్ప తాము ఎదగలేమని పవన్ భావిస్తున్నారు.
అదీ కాకుండా వామపక్ష పార్టీలను నమ్ముకుంటే తమ రాజకీయ భవిష్యత్తుకి అడ్డం అన్నట్టుగా పవన్ భావిస్తున్నారు.అందుకే వామపక్ష పార్టీలకు దూరంగా జరుగుతున్నారు.
మొత్తంగా చూసుకుంటే పవన్ కు ఇందులో పెద్దగా పోయేది ఏమీ లేకపోయినా పవన్ ను ఇప్పటివరకు నమ్ముకుని ఉన్న వామపక్ష పార్టీలు మాత్రం ఘోరంగా దెబ్బతిన్నాయి.