వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ కు సంబంధించిన వ్యవహారంలో నేడు కీలక ఘట్టం నమోదు కానుంది.ఇప్పటిదాకా ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరయ్యే విషయంలో ససేమిరా అంటున్న రోజా… ఎట్టకేలకు నేడు జరిగే కమిటీ విచారణకు హాజరుకానున్నారు.
నేటి మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో భేటీ కానున్న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకానున్న రోజా… తన వాదనను వినిపించనున్నారు.
నిండు సభలో సభా నాయకుడి స్థానంలో ఉన్న సీఎం నారా చంద్రబాబునాయుడితో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై ప్రివిలేజ్ కమిటీ ముందు విచారణకు హాజరై తన వాదనను వినిపించేందుకు నిరాకరించిన రోజా… న్యాయస్థానాలను వేదికగా చేసుకుని పోరాటం సాగించారు.ఈ క్రమంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇవ్వగా, డివిజన్ బెంచ్ సస్పెన్షన్ ను సమర్థించింది.
తాజాగా రోజా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై త్వరలోనే విచారణ జరగనుంది.