దేశంలో కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది.గడచిన వారం పది రోజులుగా రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు బయటపడుతున్నాయి.
మరణాలు కూడా 3 వేలు దాటుతున్నాయి.కోలుకున్నవారి కంటే కొత్తగా వైరస్ నిర్ధారణ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
దీంతో ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఏర్పడి రోజూ డజన్ల కొద్దీ ప్రాణాలు కోల్పోతున్నారు.దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక బాధితుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి.
తమ కళ్లేదుటే విగతజీవులుగా మారుతుంటే వైద్యులు నిస్సాహయ స్థితిలో ఉండిపోతున్నారు.ఇలాంటి పరిస్థితి చూడలేక ఢిల్లీలో ఓ యువ వైద్యుడు నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.ఈ ఇబ్బందులను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
ఇదే విషయంలో సుప్రీంకోర్టు సహా పలు హైకోర్టులు సుమోటాగా స్వీకరించి విచారణ జరుపుతున్నాయి.సకాలంలో వైద్యసేవలు అందక నిండు ప్రాణాలు హరించుకుపోతున్నాయి.
ఇలాంటి విపత్కర పరిస్థితులలో మానవత్వం చాటుకున్నారు ఓ మంత్రి.ఈ ఘటన ఒడిశా లోని బర్ఘా జిల్లా సొహేలా ప్రాంతంలో జరిగింది.తబేలా గ్రామానికి చెందిన ఓ యువకుడికి కొవిడ్ సోకింది.బాధితుడికి వైద్య పర్యవేక్షణలో చికిత్స అందించాల్సి ఉందని తెలుసుకున్న మంత్రి సుశాంత సింగ్ తానే స్వయంగా అంబులెన్సు నడుపుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్లారు.
సోహేలా లోని ఆస్పత్రిలో చేర్చి.బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
మంత్రి సుశాంత ఇటీవలే ఆ ప్రాంతంలో కొవిడ్ బాధితుల కోసం అంబులెన్సు ను విరాళంగా ఇచ్చారు.ఇదిలా ఉండగా భారత్ ప్రజలకు మరో శుభవార్త అందింది.
భారత్ లో గత మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,57,229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 3,20,289 మంది కోలుకోగా 3,449 మంది మరణించారు.దాంతో మరణాల సంఖ్య 2,22,408 కి పెరిగింది.