వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తరువాత రెండో స్థానంలో ఉంటూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీని లీడ్ చేస్తున్న వ్యక్తి విజయసాయిరెడ్డి.జగన్ కు ఉన్న నమ్మకస్థుల్లో అత్యంత ముఖ్యమైన కీలకమైన వ్యక్తి ఆయన.
పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విజయసాయిరెడ్డి పాత్ర కూడా కీలకమైంది అన్న సంగతి అందరికి తెలిసిందే.జగన్ అక్రమాస్తుల కేసులోనూ జగన్ తో పాటు ఆయన ఆర్థిక వ్యవహారాలను చూసిన సాయిరెడ్డి కూడా ప్రధాన నిందితుడే.
జగన్ వైసీపీ పెట్టిన తరువాత విజయసాయిరెడ్డి కూడా రాజకీయాల్లోకి రావడం, వైసీపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిపోయాయి.ఈ క్రమంలోనే వైసీపీ తరపున తొలి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సాయిరెడ్డి ఢిల్లీలోనూ పార్టీకి మైలేజ్ వచ్చేలా చేయగలిగారు.
ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే సాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఆయనకు పార్టీలో సంచిత స్థానం కూడా దక్కింది అని అంతా అనుకుంటుండగానే అకస్మాత్తుగా ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించి జగన్ సంచనం సృష్టించారు.జగన్ తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయం అటు సొంత పార్టీలోనే కాకుండా అన్ని రాజకీయ వర్గాల్లోనూ సంచలనం సృష్టించింది.జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన విజయసాయి రెడ్డి విషయంలో ఆయన ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడో ఎవరికీ అర్ధం కాలేదు.
వైసీపీ నేతలకు కూడా జగన్ నిర్ణయంలోని అసలు కారణం ఏంటో తెలియాక తికమకపడుతున్నారు.అయితే ఈ విషయంపై జగన్ కు అత్యంత సన్నిహితులను ఆరాతీయగా అసలు విషయం బయటపడింది.
అదేంటి అంటే రాజ్యసభ సభ్యుడిగా, పార్టీ పార్లమెంటరీ నేతగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాయిరెడ్డికి ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా కూడా కీలక బాధ్యతలు అప్పగించడం వల్ల ఆయన వత్తిడికి గురవుతారని జగన్ భావించినట్టు తెలుస్తోంది.ఇప్పటికే పార్టీలోనే కాకుండా పార్లమెంటరీ పార్టీ నేతగానూ కీలక బాధ్యతల్లో ఉన్న సాయిరెడ్డిని ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి బాధ్యతల నుంచి తప్పించి ఆ పదవిని మరో కీలక నాయకుడికి అప్పగిస్తే బాగుంటుంది అని జగన్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి పదవి నుంచి తొలగించినట్టుగా ప్రచారం జరుగుతోంది.ఆయన స్థానంలో జగన్ ఎవరికి అవకాశం కల్పించబోతున్నారో చూడాలి.