తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీల్లోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది.ఎన్నికల ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనే విషయం పై స్పష్టమైన క్లారిటీ రాకపోవడంతో… ఫలితాలపై అందరిలోనూ టెన్షన్ మొదలయ్యింది.
అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే పరిస్థితి ఏంటనే దానిపై కూడా చర్చ కూడా జరుగుతోంది.హంగ్ వస్తే ఏంటి పరిస్థితి అనే విషయంలో పార్టీలు తర్జనభర్జనలు పడుతున్నాయి.
మొదటి నుంచి మజ్లీస్ పార్టీ తమకు మద్దతిస్తుందని అందుకే వారి స్థానాల్లో తమకు ఫ్రెండ్లీ పోటీ ఉందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పుకొస్తూనే ఉన్నారు.అయితే తాజా పరిణామాలతో ఎంఐఎం వైఖరి ఎలా ఉండబోతోందనే విషయం పై క్లారిటీ లేకుండా పోయింది.
తాజా రాజకీయ పరిణామాలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్… ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇవాళ భేటీ కాబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.దీంతో వీరిద్దరి సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.ముఖ్యంగా ప్రచారం సమయంలో కూడా టీఆర్ఎస్కే ఓటెయ్యాలని అసదుద్దీన్ ఒవైసీ చెప్పుకొచ్చారు.తాము లేనిచోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులకే మద్దతివ్వాలని స్పష్టం చేశారు.
కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలోకి రావడం కష్టమే అన్న వార్తలు వస్తుండడం తో ఎంఐఎం లో మార్పు కనిపిస్తోంది.
ఈ సమయంలోనే మజ్లీస్ పార్టీ మద్దతు కూడగట్టుకునేందుకు ప్రజకూటమి కూడా విశ్వప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే ఆ పార్టీ అధినేతతో కాంగ్రెస్ ఒకసారి చర్చలు కూడా నిర్వహించింది.కానీ తమ మద్దతు ఎవరికి ఇచ్చేది అసదుద్దీన్ క్లారిటీ ఇవ్వడంలేదు.
మరో 5 నెలల్లో సాధారణ ఎన్నికలు రానున్నాయి.అలాగే రేపు వెలువడనున్న 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది.
ఒకవేళ 4 రాష్ట్రాల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే… వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో మజ్లీస్ ప్రజాకూటమికి మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.ఒకవేళ హంగ్ వస్తే తమ పార్టీ మద్దతు కీలకం అని భావిస్తున్న బీజేపీ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది.