ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి.ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న క్రమంలో , ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు మొదలయ్యాయి.
ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో రాబోయే ఎన్నికల్లో సీటు దొరికే అవకాశం లేదనుకున్న నేతలు, మొదటి నుంచి పార్టీలో ఉన్నా, తమకు సరైన ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తితో ఉంటున్న నేతలు ఇలా ఎంతోంది నియోజకవర్గ స్థాయి నాయకులు పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపిస్తోంది .వీరందరికీ ఇప్పుడు జనసేన ఆప్షన్ గా కనిపిస్తోంది.గతంతో పోలిస్తే జనసేన(janasena) బాగా బలం పుంజుకోవడం, రాబోయే ఎన్నికల్లో టిడిపి జనసేన బిజెపిలో కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా సంకేతాలు వెలబడుతుండడం ఇవన్నీ లెక్కలు వేసుకుని చాలా మంది వైసిపి నేతలు జనసేన వైపు చూస్తున్నారు.మరి కొంతమంది నేతలు జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తుండగానే టిడిపి వారికి గేలం వేస్తూ తమ పార్టీ లో చేర్చుకుంటోంది.
బిజెపి ఏపీ మాజీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) జనసేన లో చేరాలని చూసారు అయితే టిడిపి టికెట్ తో పాటు, రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తామనే హామీ ఇవ్వడంతో ఆయన టిడిపిలో చేరిపోయారు.టిడిపి కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకటరమణ ( Jaya Mangala Venkataramana)కూడా టిడిపి ని వీడి వైసిపి లో చేరారు.ఇక వైసిపి మాజీ ఎమ్మెల్యే టివి రామారావు తో పాటు, టిడిపి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం బిజెపిలో ఉన్న ఈదర హరిబాబు జన సేన లో చేరిపోయారు.ఈ విధంగా ఇతర పార్టీలోని అసంతృప్త నాయకులు , తమకు టిక్కెట్ దక్కదు అనుకున్న వారు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా జనసేన వైపు ఆసక్తి చూపిస్తూ ఆ పార్టీలో చేరుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయనే నమ్మకంతో పాటు, ప్రస్తుత పార్టీలో కొనసాగినా టికెట్ దక్కకపోతే మరో ఐదేళ్లు వేచి చూడాల్సి వస్తుందేమోనన్న భయంతో చాలామంది టిడిపి వైసిపి నేతలు జనసేన వైపు చూస్తున్నారు.అయితే ఈ విధంగా వలస వస్తున్న నాయకులతో జనసేనకు ఎంత మేరకు ప్రయోజనం కలుగుతుంది ? రాబోయే ఎన్నికల్లో వారు పోటీ చేసినా, గెలవకపోతే వారు పార్టీని అడ్డుపెట్టుకుని ఉంటారా ? స్థానికంగా వారికి ఉన్న బలం, బలగం ఎంతవరకు జనసేన గెలుపునకు ఉపయోగపడుతుంది అనే ప్రశ్నలు ఎన్నో తెరపైకి వస్తున్నాయి.