ఎన్నికల వేళ రాజకీయ నాయకుల హామీలకు అడ్డు అదుపు ఉండదు.అధికారంలో లేని పార్టీలు అధికారం కోసం అనేక రకాల హామీలు ఇస్తూ ఉంటాయి.
ఇక అధికారంలో ఉన్న పార్టీ అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ… అమలు చేస్తూ… మైలేజ్ పెంచుకునేందుకు ట్రై చేస్తుంటాయి.ఏపీలో మొన్నటి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరిగినట్టు కనిపించింది.
అనేక జాతీయ సర్వేలు కూడా….వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కబోతోంది అన్నట్టు ప్రకటించేసాయి.
అయితే ఈ పరిణామాలు అధికార పార్టీ టీడీపీలో ఆందోళన పెంచాయి.ఏదో ఒక విధంగా ప్రజల్లో మద్దతు సంపాదించి అధికారం చేపట్టాలనే ఆలోచనతో డ్వాక్రా మహిళలకు పదివేల రూపాయలు … వృద్ధాప్య పెన్షన్ రెండు వేల రూపాయలకు పెంచడం… నిరుద్యోగ భృతి డబుల్ చేయడం… డబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్ ఇలా రకరకాలుగా ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టింది.
ఈ పరిణామాలన్నీ తమకు విపరీతంగా మైలేజ్ తెచ్చాయని టీడీపీ భావిస్తోంది.వాస్తవ పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది.ఏ వర్గానికి ఆ వర్గాల వారీగా… మద్దతు సంపాదించేశామని టీడీపీ భావిస్తోంది.ఇప్పటికే… బిసి సబ్ ప్లాన్ తెచ్చి వారిని ఆకట్టుకున్నాం.మైనారిటీలకు సంక్షేమ పథకాలతో ఆకర్షించాం.నాలుగు లక్షల మందికి గృహాలు మంజూరు చేసి గృహప్రవేశాలు చేయించి పేద వర్గాలను సంతృప్తి పరిచాం.కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రచారం సైతం చేపట్టాం.ఇక ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను కూడా రంగంలోకి దించబోతున్నాం ఇక తమకు తిరుగే లేదు అని టీడీపీ భావిస్తూనే మరోవైపు ఆందోళన కూడా చెందుతోంది.
ఇంతకీ టీడీపీకి ఈ అనుమానం రావడం వెనుక కూడా ఒక బలమైన కారణం ఉంది.ఎందుకంటే… తాము ప్రకటించిన సంక్షేమ పథకాలు అందుకున్న వారంతా….సంతృప్తిగా ఉన్నారా లేక ఇంకా అసంతృప్తితోనే ఉన్నారా అనే సందేహం టీడీపీని వెంటాడుతోంది.ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకునేందుకు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పదే పదే అందరి మొబైల్ ఫోన్ లకు కాల్స్ చేయించి సంతృప్తి, అసంతృప్తి లెక్కలు వేసే పనిలో పడింది.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు తిప్పికొట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుని ఎన్నికల్లో గట్టెక్కాలని టీడీపీ చూస్తోంది.దీంతో పాటు ఏపీకి ప్రత్యేక హోదా అనే సెంటిమెంట్ ను మరింత రగిల్చి మైలేజ్ పెంచుకోవాలని టీడీపీ ప్లాన్ వేస్తోంది.
మొత్తంగా చూస్తే ….టీడీపీ ఎన్నిసంక్షేమ పథకాలు ప్రకటించినా ….
ప్రజల్లోకి బలంగా వెళ్ళామా లేదా అనే సందేహం మాత్రం వీడలేదు.