వారసత్వ రాజకీయాలు ఏపీకి కొత్తేమి కాదు.తాము ఇప్పటి వరకు సాధించిన విజయాలు, పరువు, బలం ఇవన్నీ తమ వారసులు కూడా అనుభవించి రాజకీయంగా చక్రం తిప్పాలనే ఆశతో తమ కొడుకులు కూతుళ్లను కూడా రాజకీయాల్లోకి దింపేందుకు ఆసక్తి చూపిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు రాజకీయ వారసత్వం అనేది సర్వసాధారణంగా మారిపోయింది.ప్రజలు కూడా రాజకీయ వారసులను ఆదరించేందుకు సిద్ధంగానే ఉంటూ స్వాగతిస్తుండడంతో ఏపీలో వారసత్వ రాజకీయం అనేది సాధారణ విషయం మారిపోయింది.
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు హవా ఎక్కువగా ఉంది.వయసు రీత్యా రాజకీయాలకు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఉండడంతో వారంతా వారసులను రంగంలోకి దించారు.పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ముందే వారికి అన్ని రకాలుగా జాగ్రత్తలు, స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇప్పించారు.ఇక రాజకీయ వారసులు కూడా తమ తండ్రో, తల్లో రాజకీయాల్లో ఉండడంతో వారి వారి వారసత్వాన్ని తీసుకుని తాము కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్యెల్యేనో, ఎంపీనో అన్ని కుదిరితే మంత్రో అయిపోవాలని కలలుకంటూ ఏపీలో జరిగిన ఎన్నికల్లో చాలామంది నేతల వారసులు ఎన్నికల్లో పోటీకి దిగారు.
ప్రధానంగా టీడీపీ నుంచి వారసులు ఎన్నికల్లో ఎక్కువగా పోటీ చేశారు.అయితే వారంతా క్షేత్ర స్థాయిలో కొత్త వారు కావడం, పార్టీపై వ్యతిరేకత, వైసీపీ గాలి, ఇవన్నీ వారికి ప్రతికూలంగా మారడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.అయితే వైసీపీ నుంచి కూడా రాజకీయ వారసులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.వీరిలో చాలామంది విజయం సాధించారు.ఓటమి చెందిన రాజకీయ వరుసలు చాలామంది అప్పుడే రాజకీయాలపై బోర్ కొట్టేసిందట.పార్టీ అధికారంలో లేకపోవడం, ఇప్పుడు ఎక్కువగా యాక్టివ్ గా ఉంటే అధికార పార్టీ నుంచి వేధింపులు ఎదుర్కోవాలి అనే ఆలోచనతో కాస్త వెనక్కి తగ్గుతున్నట్టుగా తెలుస్తోంది.
వీరిలో జేసీ అస్మిత్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.అలాగే విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసిన జలీల్ కుమార్ షబానా ఖతూన్ ఇప్పటికే అమెరికా వెళ్లి పోయారు.
రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన మురళీ మోహన్ కోడలు మాగంటి రూపాదేవి రాజకీయ నైరాశ్యంలో ఉన్నారు.
అలాగే అనంతపురం జిల్లా కు చెందిన పరిటాల రవి వారసుడు శ్రీరామ్ కూడా టీడీపీలో ఉండేందుకు ఇష్టం లేకపోయినా తప్పనిపరిస్థితుల్లో ఉండాల్సి రావడంతో అయిష్టంగానే రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
కర్నూలులో కేఈ కృష్ణమూర్తి వారసుడు శ్యామ్ బాబు, శ్రీకాళ హస్తిలో బొజ్జల కుమారుడు సుధీర్ వంటివారు కూడా రాజకీయాలకు దూరం పాటిస్తున్నారు.అయితే వీరంతా ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూసినవారే.వీరంతా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి లోకేష్ ను ఉదాహరణగా చూపిస్తున్నారు.ఆయన మంగళగిరిలో ఓటమి చెందిన తరువాత ఇంటా బయట తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు.ఇదే పరిస్థితి తమకు ఉండడంతో పాటు పార్టీ నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉండడంతో మనకు ఎందుకు వచ్చిన తలనొప్పి అన్నట్టుగా వీరంతా తమ వ్యాపారాల్లో బిజీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.