ఇంటికొస్తే కూర్చోపెట్టడమో, లేచి నిలుచుంటే కూర్చోబెట్టడమో కాదు.అధికార పీఠంపై కూర్చోబెట్టడమని అర్థం.ఎవరిని? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి మమతా బెనర్జీని.పశ్చిమ బెంగాల్లో ముప్పయ్ మూడేళ్ల వామపక్ష (సీపీఎం) పరిపాలనను భరించిన ప్రజలు గత ఎన్నికల్లో దాన్ని ఓడించి తృణమూల్ కాంగ్రెసుకు పట్టంకట్టారు.
ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన మమతా బెనర్జీని పీఠం ఎక్కించారు.వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.ఆ ఎన్నికల్లో తామే గెలిచి అధికారంలోకి వస్తామని మమత ధీమాగా చెప్పారు.ఇందులో డౌటే లేదన్నారు.
గత నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏది చెబితే అదే ఫైనల్ అని, వారి నిర్ణయం తమకు అనుకూలంగా ఉంటుందని అన్నారు.
తాము పని చేశాం కాబట్టే విజయంపై విశ్వాసంతో ఉన్నామన్నారు.తాము రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశామని మమత చెబుతుండగా గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన సీపీఎం గత నాలుగేళ్లుగా కారాలు మిరియాలు నూరుతూనే ఉంది.
మమత అరాచక పాలన సాగిస్తున్నారని దుమ్మెత్తి పోస్తోంది.వచ్చే ఎన్నికల్లో అధికారం తమకే దక్కుతుందని ఆశలు పెట్టుకుంది.
మమత మాటలు వింటుంటే ఆమెకు విశ్వాసం లోపించినట్లుగా కనబడుతోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు సలీం అన్నారు.ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు.
వీరు ఎన్ని మాట్లాడినా ప్రజలు ఏం అనుకుంటున్నారో అప్పడే చెప్పలేం.