భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తోంది.రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
అటు కోవిడ్ లక్షణాలతో జనం ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్ల మీద అంబులెన్స్ల సైరన్లు, ఆక్సిజన్ ట్యాంకర్ల పరుగులు ఎక్కువయ్యాయి.
పెరుగుతున్న కేసులతో భారతీయ వైద్య రంగంపై ఒత్తిడి ఎక్కువవుతోంది.ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ నిండుకోవడంతో చికిత్స అందించడం కష్టమవుతోంది.
పేదవారే కాదు.కోటీశ్వరుడైనా సరే హాస్పిటల్లోకి ఎంట్రీ పాస్ దొరకడం లేదు.
పోనీ పక్క రాష్ట్రానికి వెళ్లి చికిత్స తీసుకుందామంటే సరిహద్దుల్లోనే గేట్లు మూసేస్తున్నారు ఆయా రాష్ట్రాల పోలీసులు.
ఏపీ- తెలంగాణల మధ్య ఈ వ్యవహారం ఏ స్థాయికి వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి అంబులెన్స్లను అనుమతించేది లేదని తేల్చి చెప్పింది.చివరికి కోర్టులు జోక్యం చేసుకుంటేనే గానీ పరిస్ధితి చక్కబడలేదు.
ఇన్ని అవస్థలు, వ్యయ ప్రయాసలకోర్చి కోవిడ్ నుంచి బయటపడినా.ఆసుపత్రి గుమ్మం దగ్గరే బ్లాక్ ఫంగస్ రూపంలో మరో మహమ్మారి కాచుకు కూర్చుంటోంది.
గడిచిన కొద్దిరోజులుగా దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా బయటపడుతున్నాయి.ప్రస్తుతం కోవిడ్ కేసుల ఉద్ధృతి ఎక్కువగా వున్న రాష్ట్రాల్లోనే ఫంగస్ దాడి చేస్తుండటంతో ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది.
ఇప్పటికే కరోనాను ఎలా అదుపు చేయాలో తెలియక చేతులెత్తేస్తున్న ప్రభుత్వాలకు ఈ బ్లాక్ ఫంగస్ తలనొప్పిగా మారింది.ఈ నేపథ్యంలో ఇండియాలో పరిస్ధితులు రోజురోజుకు అత్యంత భయానకంగా మారిపోతున్నాయి.
దీంతో కొందరు దేశం విడిచి కొన్నాళ్లు ఎక్కడికైనా వెళ్లాలని భావిస్తున్నారు.వీరిలో ముందుంటున్నారు కుబేరులు.మెరుగైన హెల్త్ కేర్ సర్వీసులు, జీవన ప్రమాణాల కోసం భారత్లోని సంపన్నులు, కార్పొరేట్ సంస్థల అధినేతలు, నిపుణులు విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నారు.ప్రస్తుతం ఏ దేశంలో కోవిడ్ కేసులు తక్కువగా వున్నాయి.
వ్యాక్సిన్ నిల్వలు, అత్యాధునిక వైద్యం, వ్యాపారాలకు అనువుగా వున్న ప్రాంతాల కోసం గ్లోబల్ మ్యాప్ తిరగేస్తున్నారు.తమకు అన్ని వసతులు గల దేశం గురించి సమాచారం కావాలంటూ సంపన్నులు, నిపుణులు ఇటీవల ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్లను సంప్రదించడం పెరిగిపోయిందట.
ఈ లిస్ట్లో బ్రిటన్ వైపు మనవారి చూపు పడింది.ఆ తర్వాత కెనడా, సైప్రస్, మాల్టా, పోర్చుగల్, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాలు నిలిచాయి.తాత్కాలికంగా స్ధిరపడటంతో పాటు తమ వ్యాపారాలను అక్కడే స్థాపించి కొనసాగించేందుకు చర్యలు చేపటుడుతున్నారు.ముఖ్యంగా జర్మనీ, స్పెయిన్, పోలండ్, స్వీడన్, డెన్మార్క్ తదితర దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి భారతీయ కుబేరులు ఆసక్తి చూపుతున్నారు.
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలిగిన తర్వాత వివిధ దేశాల ఇన్వెస్టర్లు, నిపుణులైన వర్కర్లకు బ్రిటన్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రత్యేకమైన వీసాపై బ్రిటన్లో నేషనల్ హెల్త్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
ఇది ఇన్వెస్టర్లు, స్కిల్డ్ వర్క్ వీసా అందుకున్న వారికి వర్తిస్తుంది.గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్రిటన్ తదితర దేశాలకు వెళ్లే వారి కోసం ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సుమారు 40 శాతం పెరిగిందని న్యాయవాదులు, ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు.ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2020 నాటికి భారత్ ఆవల 1.8 కోట్ల మంది ఇండియన్లు జీవిస్తున్నారు.ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే.భారతీయులే అత్యధికంగా మాతృదేశానికి అవతల జీవిస్తున్నారట.