ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారికి చిత్రపురి లో నివాసం కల్పించాలని తాజాగా కందికొండ కుమార్తె మాతృక సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ ను అభ్యర్థించారు.
చిత్రపురిలో సొంత ఇంటిని నిర్మించడం కోసం తన తండ్రి నాలుగు లక్షల డబ్బులు ఖర్చు చేశారని అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా మిగతా డబ్బులు చెల్లించలేకపోయాము అని తెలిపారు.ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్న తమకు తన తండ్రి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చిత్రపురిలో సొంత ఇంటిని ఏర్పాటు చేయించాలని ఆమె కేటీఆర్ గారిని వేడుకోవడంతో వెంటనే కేటీఆర్ ఈ విషయంపై స్పందించారు.
ఈ సందర్భంగా కందికొండ కూతురు మాతృక విజ్ఞప్తికి స్పందించిన కేటీఆర్ కందికొండ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని వెల్లడించారు.గతంలో అతని కుటుంబాన్ని ఆదుకున్నామని ఇప్పుడు కూడా తన కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు.ఈ క్రమంలోనే వారి సమస్యలపై ఆఫీసు సిబ్బంది, మంత్రి తలసానితో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా, సహాయం అందేలా చూస్తామని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.