తెలంగాణ రాష్ట్రంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టి చూపిస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.శాసనసభ ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క శాసన సభ సమావేశంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని స్పందించారు.
ప్రతిపక్ష నేతను వెంబడి ఉంటూ లక్ష ఇళ్లు కట్టి చూపిస్తానని తేల్చి చెప్పారు.ఇప్పటికే నగరంలోని గోడికేకబీర్, ఇందిరాగాంధీ కాలనీ, జియాగూడ, బన్సీలాల్ పేట, కట్టెలమండి ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ప్రతిపక్షనేత భట్టి విక్రమార్కకు చూపించామన్నారు.
పేదలకు పక్కా ఇళ్లు అందించాలనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని, ఈ ఇళ్ల డిజైన్ ను కూడా సీఎం కేసీఆరే తయారు చేశారన్నారు.
నగరంలో మొత్తం 60 ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు.
ఈ రోజు చూసింది కేవలం శాంపిల్ మాత్రమే అని ఆయన అన్నారు.దేశ చరిత్రలో ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లను అందించనుందన్నారు.ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసిందని, కొల్లూరులో 15 వేల ఇళ్లు నిర్మించామన్నారు.ఈ డబుల్ బెడ్రూం ఇళ్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మాత్రమే కేటాయిస్తున్నామని, ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత వీలైనంత త్వరగా పేదలకు ఇళ్లు కేటాయిస్తామన్నారు.