ప్రస్తుతం తెలంగాణాలో జరగనున్న హుజూర్ నగర్ ఎన్నికలు టీఆర్ఎస్ లో విజయ ధీమాను పెంచుతున్నాయి.టి.
కాంగ్రెస్ నాయకుల మధ్య ఏర్పడిన వర్గ విబేధాలు, ఆధిపత్య పోరే టీఆర్ఎస్ కు వరంగా మారినట్టు కనిపిస్తోంది.ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమకుమార్ రెడ్డి భార్యను బరిలోకి దించడంపై రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నారు.
తాను ఎంపిక చేసిన అభ్యర్థికే సీటు ఇవ్వాలంటూ ఆయన పోటీ పడుతున్నారు.దీంతో టి.కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది.ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంగా ఉన్న హుజూర్ నగర్ ఉప ఎన్నికను ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది.
అంతే కాదు అక్టోబర్ 21 వ తేదీన ఈ ఎన్నిక జరగబోతోంది.ఆ ఎన్నిక ఫలితాలు అదే నెల 24 వ తేదీన ప్రకటించబోతున్నారు.ఈ మేరకు సీఈవో రజత్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు.దీంతో ఈ రోజు అనగా 23 వ తేదీ నుంచి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడబోతోంది.
ఇక ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటికే సైదిరెడ్డి ని ఎంపిక చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద స్వల్ప ఓట్ల తేడాలో సైదిరెడ్డి ఓడిపోయారు.ఈసారి కూడా సైదిరెడ్డికే అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్.ఈ ఉప ఎన్నికల బాధ్యతల్ని మంత్రి హరీష్ రావుకి అప్పగిస్తారని మొదటి నుంచి అంతా అనుకున్నా మరో మంత్రి జగదీష్ కి ఈ వ్యవహారాలను సీఎం అప్పగించినట్టు సమాచారం.
అవసరమైతే మరికొందరు మంత్రులు, చుట్టుపక్కల నియోజక వర్గాల ఎమ్మెల్యేలు ఆయనకి సహాయం చేయాల్సి ఉంటుందనిఎం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీటులో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని కేసీఆర్ గట్టిగానే నేతలకు సూచించాడు.ఇక కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలోకి దిగుతున్నట్టు ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ ప్రకటన అధికారికంగా ఇంకా వెలువడలేదు.దీనికి కారణం కాంగ్రెస్ లో నెలకొన్న గ్రూపు రాజకీయాలే కారణం.
ఉత్తమ్ కి మద్దతుగా జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు జిల్లాలో ఏకమయ్యారు.రేవంత్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని హైకమాండ్ కి కూడా చెప్పినట్టు సమాచారం.పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని కాదని పద్మావతిని కొనసాగిస్తారో, ఈ విషయంలో రేవంత్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారో ఇంకా ఎటువంటి స్పష్టతా లేదు.సరిగ్గా ఇదే అదునుగా కారు పార్టీ ప్రచారంలో దూసుకుఎల్లిపోవాలని చూస్తోంది.
కాంగ్రెస్ లో నెలకొన్న గందరగోళం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సైదిరెడ్డితో చర్చించినట్టు తెలుస్తోంది.కాంగ్రెస్ లో ఈ లొల్లి ఇప్పట్లో చల్లరాదని, ఇదే అవకాశంగా తీసుకుని ప్రచారంలో ముందుకు వెళ్లాలని చెప్పినట్టు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇవేవి పట్టించుకునే పరిస్థితుల్లో కనిపించడంలేదు.