గత కొద్ది రోజులుగా విజయవాడ టిడిపి ఎంపీ కేసినేని నాని వ్యవహారం ఆ పార్టీలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.ప్రత్యక్షంగా, పరోక్షంగా పార్టీ పైన, పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపైన నాని సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పార్టీలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవాలని చెబుతూనే అనేక అంశాలను ప్రస్తావిస్తూ పరోక్షంగా బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పైన విమర్శలు చేస్తున్నారు.దీనికి సీఎం రమేష్ సైతం ఘాటుగాని స్పందిస్తూ నాని పై విమర్శలు చేస్తున్నారు.
దీంతో అసలు బిజెపి ఎంపీ కి, టిడిపి ఎంపీకి మధ్య వివాదం రావడానికి కారణం ఏమిటి ? అసలు ఈ ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి ? గతంలో వీరిద్దరూ ఎంతో స్నేహంగా మెలిగే వారిని, ఇప్పుడు అకాల వైరం వెనుక కారణాలు ఏమిటనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.
కేశినేని నాని 2014 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలిచారు.
అలాగే 2019 ఎన్నికల్లోను మరోసారి టిడిపి ఎంపీగా విజయం సాధించారు.ఇక సీఎం రమేష్ విషయానికొస్తే, 2004 ఎన్నికలకు ముందు నుంచే టిడిపి తరఫున ఆయన యాక్టివ్ గా పనిచేశారు. ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఆ పార్టీకి ఆర్థికంగా అండదండలు అందిస్తూ వచ్చారు.2014లో టిడిపి అధికారంలోకి వచ్చేవరకు ఆర్థికంగా ఆ పార్టీని ఆదుకున్నారు.ఆ కృతజ్ఞత తోనే చంద్రబాబు సీఎం రమేష్ కు రెండుసార్లు రాజ్యసభ కు వెళ్లే అవకాశాన్ని కల్పించారు.అయితే 2019 ఎన్నికల తర్వాత టిడిపి ఓటమి చెందడం తదితర పరిణామాలతో సీఎం రమేష్ బిజెపిలో చేరారు .కానీ కేశినేని నాని మాత్రం టిడిపిలోనే ఉంటూ ఆ పార్టీ కోసం గట్టిగానే పనిచేస్తూ, వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పార్టీకి అండగా నిలిచేవారు.
అయితే తన పార్లమెంటు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం కేంద్ర బిజెపి పెద్దలను కేశినేని నాని కలుస్తుండగా, దానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు చంద్రబాబు కు సీఎం రమేష్ చేరవేస్తున్నారని, తాను పార్టీ మారే ఆలోచనతోనే ఇదంతా చేస్తున్నాననే విధంగా ఆయన టిడిపి అధిష్టానానికి సమాచారం ఇస్తున్నారని అనుమానం నాని లో బలపడుతూ వస్తోంది.ప్రత్యక్షంగా సీఎం రమేష్ బిజెపిలో ఉన్నా, ఆయన పూర్తిగా టిడిపి కోసమే పని చేస్తున్నారనే విషయాన్ని నాని బలంగా నమ్ముతున్నారు.చంద్రబాబు తనును దూరం పెట్టే విధంగా సీఎం రమేష్ ఫిర్యాదులు చేస్తున్నాడని నాని భావిస్తూ ఉండడంతోనే, ఇప్పుడు తన అసంతృప్తిని ఈ విధంగా బయటపెడుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి.
కేశినేని నాని కనుక బిజెపిలో చేరితే … ఇప్పటి వరకు ఏపీ నుంచి బిజెపి ఎంపీ గా తనకు ఉన్న మంచి ప్రాధాన్యం తగ్గుతుందని సీఎం రమేష్ భావిస్తూ ఉండడంతోనే తనకు వ్యతిరేకంగా ఈ విధంగా కుట్ర పన్నుతున్నారనే అనుమానాలు నానిలో మొదలయ్యాయట.అందుకే సీఎం రమేష్ ను ఏక్ నాథ్ షిండేతో పోల్చి మరీ విమర్శలు చేసేస్తున్నారు.