ఆ గ్రామంలో ఓ పుకారు వేగంగా షికారు చేస్తోంది.అయితే ఇది పుకారు అని కొట్టిపారేయొద్దని చాలా ఖరాఖండిగా చెబుతున్నారు ఆ ఊరి జనాలు.
అక్కడ ఓ ఆడ దెయ్యం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరిని వదిలి పెట్టడంలేదని వాపోతున్నారు.సదరు దెయ్యం అవహించడంతో చేతితో తాడు పట్టుకుని ఉరి వేసుకునేందుకు కొందరు మహిళలు ఇంటినుంచి పరుగులు పెట్టడం చూసి స్థానికులు భయంతో వణికిపోతున్నారు.
పూర్తి వివరాలిలా వున్నాయి.ఆ గ్రామం పేరు ధర్మాపూర్.
ఈ గ్రామం వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని కలదు.ఇక్కడ సుమారు వెయ్యి మంది జనాభా కలరు.
గత 4 నెలల్లో ఇప్పటి వరకు 12మంది ఆ మహిళ కారణంగా మృతి చెందారని చెబుతున్నారు.జూన్ 22 నుంచి 28వరకు కేవలం 6 రోజుల వ్యవధిలోనే వరుసగా 4మృతి చెందారట.
ఈ మరణాల విషయంలో వారికి కొన్ని అనుమానాలు వున్నాయి.ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించిన ఓ మహిళ దెయ్యం అయ్యిందని.
అందరిని భయాందోళనకు గురి చేస్తుందని, వ్యవసాయ పనికి ఇతర గ్రామాలకు ఆటోలో వెళ్లే మహిళలను టార్గెట్ చేస్తూ ఆ దెయ్యం వేధిస్తోందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ కారణంగా గత 3రోజులుగా ఆ వూరి జనాలు పనులు మానేసి, దెయ్యం ఎవరిని అవహిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.ఇక వారు బయటకి వెళ్లినా సాయంత్రం 6గంటల సమయానికి ఇండ్లకు చేరుకుని, ఆ తరువాత బయటకు వెళ్లడం లేదు.ప్రతి రోజు మహిళలు వ్యవసాయ పనులకు ఇతర గ్రామాలకు వెళ్లే క్రమంలో వారితో పాటు ఓ మహిళ పనులకు వచ్చేదని, గత నెల 26న మరణించిన సదరు మహిళే అందరిని ఆవహించి ఇబ్బందులకు గురి చేస్తుందని గ్రామ మహిళలు ఆరోపిస్తున్నారు.
ఈ సమస్యపై గ్రామంలో పంచాయతీ జరిగి, పోలీసులకు ఫిర్యాదు రావడంతో దర్యాప్తు చేస్తున్నారు.