నేటి తరుణంలో రోజు రోజుకీ సోషల్ మీడియా ప్రభావం జనాలపై ఏవిధంగా పెరిగిపోతుందో అందరికీ తెలిసిందే.సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నింటినీ నిజమని నమ్ముతున్నారు.
దీని వల్ల కొందరు మోసపోతుంటే.కొందరు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.
ఇక మీడియా కూడా కొన్ని సార్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నిజమే అని నమ్మతుండడంతో అసలు నిజమైన వార్తలేవో, నకిలీవి ఏవో జనాలకు తెలియడం లేదు.సరిగ్గా అక్కడ కూడా ఇలాగే ఓ నకిలీ వార్తను జనాలు నిజమని నమ్మారు.
అందుకు కారణం అక్కడి ప్రెస్, సోషల్ మీడియాయే.దీంతో అసలు నిజం తెలిసే సరికి ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు.
అనంతరం ఘటనకు కారణమైన వ్యక్తిని కడిగిపారేస్తున్నారు.ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
అది అమెరికాలోని ఓ టెక్సాస్ రెస్టారెంట్.అందులో టెక్సాస్కు చెందిన వంటకాలను వడ్డిస్తారు.ఇక అందులో ఖలీల్ కావిల్ అనే 20 ఏళ్ల యువకుడు వెయిటర్గా పనిచేస్తున్నాడు.
అయితే అతనికి ఏం బుద్ధి పుట్టిందో తెలియదు కానీ.తమ రెస్టారెంట్లో ఫుడ్ తిన్న ఓ కస్టమర్కు చెందిన బిల్లుపై We don’t tip terrorist అనే పదాలను రాశాడు.
అనంతరం ఆ పదాలను ఆ కస్టమరే రాశాడని ఆ రెస్టారెంట్లో ఉన్న అందరిని నమ్మించాడు.అనంతరం వాటిని పలువురు ఫొటోలు తీసి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ విషయం కాస్తా వైరల్ అయింది.
ఈ క్రమంలోనే ఇలాంటి వివక్షాపూరిత వ్యాఖ్యలను ఖండిస్తూ అమెరికాలోని ప్రముఖ మీడియా చానల్స్ ఈ వార్తను ప్రసారం చేశాయి.కాగా ఆ రెస్టారెంట్ ఓనర్ కూడా ఈ విషయం నిజమే అని నమ్మి తమ వెయిటర్పై ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆ కస్టమర్ ను క్షమించేది లేదని అన్నాడు.వివక్షాపూరితమైన వ్యాఖ్యలను ఎంత మాత్రం సహించేది లేదని తెలిపాడు.అయితే ఇలా ఈ విషయం కొన్ని రోజులు సంచలనం కాగా.చివరకు తెలిసింది ఏమిటంటే… ఆ వెయిటరే కావాలని ఆ పదాలను ఓ కస్టమర్ బిల్లుపై రాశాడట.దీంతో అసలు విషయం తెలుసుకున్న రెస్టారెంట్ యజమాని ఆ వెయిటర్ను ఉద్యోగం నుంచి తొలగించాడు.
ఇక ఆ కస్టమర్కు క్షమాపణలు చెబుతూ తమ రెస్టారెంట్లో ప్రముఖంగా వండే ఫుడ్ను అతనికి ఉచితంగా అందజేశారు.కాగా ఆ వెయిటర్ ఇప్పుడు తాను తప్పు చేశానని ఒప్పుకుంటూ తనను అందరూ క్షమించాలని వేడుకుంటున్నాడు.
అయితే అసలు విషయం తెలియకుండా ఆ కస్టమర్ను నిందిస్తూ అక్కడి మీడియా చేసిన హడావిడికి ఇప్పుడు అక్కడి జనాలు నవ్వుకుంటున్నారట.అవును మరి, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా అని చెప్పి దేన్ని పడితే దాన్ని నమ్మకూడదు.
అందులో నిజాలను నిర్దారించుకున్న తరువాతే వార్తలను ప్రసారం చేస్తే బాగుంటుంది.మన దేశంలోనూ గతంలో ఇలా మీడియా పలు సందర్భాల్లో కొన్ని నకిలీ వార్తల కారణంగా పరువు పోగొట్టుకుంది.
ఇందుకు ఇతర దేశాల్లోని మీడియా కూడా అతీతం కాదదని ఇప్పుడే తెలిసింది.ఏది ఏమైనా సోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త.!
.