టీమిండియా జట్టులో యువ ఆటగాళ్లు అద్భుత ఆట ప్రదర్శనతో చెలరేగిపోతున్నారు.దిగ్గజ సీనియర్ ఆటగాళ్ల కంటే ఉత్తమ ఆటతీరును కనబరుస్తూ వావ్ అనిపిస్తున్నారు.
టీమిండియాకి మాణిక్యాలు దొరికారు అని చెప్పకనే చెబుతున్నారు.ముఖ్యంగా ఇటీవల కాలంలో శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్ తమ ప్రతిభతో అందరినీ అబ్బుర పరుస్తున్నారు.
దిగ్గజ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా వీరి టాలెంట్కు ఫిదా అయిపోయారు.తాజాగా ఈ ఇద్దరు యువ ఆటగాళ్లపై లక్ష్మణ్ పొగడ్తల వర్షం కురిపించారు.
న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్లు చక్కటి ప్రదర్శనతో టీమిండియా విజయానికి కారణమయ్యారు.కాన్పూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్లో శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించాడు.
ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ బ్యాట్స్మన్గా రికార్డు కూడా సృష్టించాడు.రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో మహ్మద్ సిరాజ్ తన బౌలింగ్తో కీలక న్యూజిలాండ్ ఆటగాళ్లను ఔట్ చేశాడు.
దాంతో కీవిస్ జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది.ఫలితంగా టీమిండియా విజయం సాధించడం సులభతరం అయ్యింది.
ఈ విషయం గురించి వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.శ్రేయస్ అయ్యర్ను స్టాండ్ ఔట్ ప్లేయర్గా కొనియాడారు.
హైదరాబాద్ బౌలర్ అయిన మహమ్మద్ సిరాజ్ను టీమిండియా అసెట్ అని అభివర్ణించారు.
తాజాగా ఓ క్రీడా ఛానెల్తో వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.‘న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్తో సుదీర్ఘ ఫార్మాట్ లో అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ ఒత్తిడిని జయించి మరీ స్టాండ్ ఔట్ ప్లేయర్గా రాణించాడు.టీమిండియా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టిన పరిస్థితుల్లో ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ న్యూజిలాండ్ బౌలర్లను గడగడలాడించాడు.
అంతేకాదు సెంచరీ సాధించి తన సత్తా చాటాడు.టీమిండియా రెండో ఇన్నింగ్స్లో కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.రెండు ఇన్నింగ్స్లోనూ అతడు సాధించిన పరుగులు టీమిండియాని గెలుపు తీరాల వైపు నడిపించాయి’ అని లక్ష్మణ్ ప్రశంసించారు.
హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ గురించి కూడా వీవీఎస్ లక్ష్మణ్ పొగిడారు.‘రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో మహమ్మద్ సిరాజ్ షార్ట్ పిచ్ బంతులు,స్వింగర్లతో న్యూజిలాండ్ కీలక ఆటగాళ్లను ఔట్ చేశాడు.టీమిండియాలో కీలక బౌలర్లు దూరమైన సమయంలో అతడు మెరుగ్గా రాణించాడు.
అతని బౌలింగ్ లో వైవిధ్యం ఉంది.అతడిలో ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చి సొంత జట్టును గెలిపించగల సామర్థ్యం ఉంది.
భారత క్రికెట్ జట్టుకు అతను గొప్ప ఆస్తి’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు.