తెలంగాణ లో వస్తున్న వరుస ఎన్నికలతో అధికార పార్టీ టిఆర్ఎస్ గట్టిగానే కష్టపడుతూ ఫలితాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది.దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు, గ్రేటర్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో టిఆర్ఎస్ నేతలు ఉరుకులు పరుగుల మీద ఉన్నారు.
కెసిఆర్ ఈ అన్ని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకొని నిత్యం పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ, వారిలో ఉత్సాహాన్ని నింపుతూ, ఫలితాలు తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా ఎప్పటికప్పుడు రాజకీయ ఎత్తులు వేస్తూ వస్తున్నారు.ఇదిలా ఉంటే అక్టోబర్ 9 తేదీన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది.
టిఆర్ఎస్ తరపున కవిత రంగంలో ఉన్నారు.దీంతో ఈ స్థానంపై ఉత్కంఠ నెలకొంది.
వాస్తవంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే క్యాంపు రాజకీయాలకు పెట్టింది పేరు.దీంట్లో ఓటర్లు అంతా స్థానిక సంస్థల ప్రతినిధులు కావడంతో, ప్రత్యర్థుల ప్రలోభాలకు చిక్కకుండా ఏ పార్టీకి ఆ పార్టీ క్యాంప్ రాజకీయాలు చేస్తాయి.
తమ పార్టీ ఓటర్లను ఎవరూ ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు ఈ విధంగా క్యాంపు రాజకీయాలు చేయడం ఎప్పటి నుంచో రాజకీయ పార్టీలకు ఆనవాయితీగా వస్తోంది.క్యాంపు రాజకీయం అంటే ఆషామాషీగా ఉండదు.
అక్కడ అ వారికి సకల మర్యాదలు చేయడంతో పాటు, వారు కోరిన కోరికలు నెరవేరుస్తారు.
ఖరీదైన బహుమతులు ఇస్తూ, వారిని ఆకట్టుకునేందుకు సొంత పార్టీ నాయకులు ప్రయత్నిస్తారు.
అయితే ఇప్పుడు మాత్రం టిఆర్ఎస్ స్థానిక సంస్థల్లో మాత్రం పెద్ద చిక్కు వచ్చి పడింది.ఇక్కడ పోటీ చేస్తుంది కేసీఆర్ కుమార్తె కవిత కావడంతో, క్యాంపు రాజకీయాలకు అవకాశం లేకుండా పోయింది.
ఎక్కడిక్కడ ఎమ్మెల్యేలే అందరిపైన నిఘా పెట్టి కదలికలను గమనిస్తూ ఉండడం వంటివి చేస్తున్నారు.అనుమానం ఉన్న నాయకులకు ఫోన్లు చేసి మరీ మాట్లాడుతున్నారు.
వీరికి తోడు కరోనా వైరస్ ప్రభావం ఉండటంతో, క్యాంపు రాజకీయాలకు ఆస్కారం లేకుండా పోయింది.దీంతో వీరంతా లబోదిబోమంటూ తన బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక సతమతమైపోతున్నారు.
ఆ స్థానంలో మరెవరు పోటీ చేసినా, తమకు మంచి బహుమతులు లభించి ఉండేదని, ఇప్పుడు ఒకరినొకరు ఓదార్చుకునే పరిస్థితి ఏర్పడింది.ఇదిలా ఉంటే, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, అందులో మూడు వంతులకు పైగా టిఆర్ఎస్ కు చెందిన వారే కావడంతో ఆ పార్టీ గెలుపు ధీమా తోనే ఉంది.