ఏపీలో అధికార పార్టీ టిడిపి ఈ మధ్యకాలంలో బలం పుంజుకుంది.మరో సారి ఎన్నికల్లో అధికారం చేపట్టే దిశగా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నారు.
టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఇదే సమయంలో టిడిపిని అధికారంలోకి రాకుండా చేయాలని చూస్తున్నారు.అయితే బాబు ని ఇరికించాలంటే కేసీఆర్ దగ్గర ప్రధాన అస్త్రంగా ఉన్న ఆయుధం ఓటుకు నోటు.
ప్రస్తుతం ఈ కేసు ఈడీ అధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది.అలాగే కేంద్ర అధికార పార్టీ బీజేపీ కూడా ఈ కేసులో బాబు చుట్టూ ఉచ్చు బిగించాలని చూస్తోంది.
అందుకే తెర వెనుక ఈ కేసుకు సంబంధించిన వివరాలు సేకరిస్తూ… ఎన్నికల సమయం నాటికి బాబు ని ఇబ్బంది పెట్టేలా అటు టీఆర్ఎస్ … ఇటు బీజేపీ పావులు కదుపుతున్నాయి.
అసలు ఓటుకు నోటు కేసుకు సంబంధించి వివరాలు పరిశీలిస్తే… ఎమ్యెల్సీ ఎన్నికల్లో గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఎమ్యెల్సీ గా వున్న స్టీఫెన్ సన్ కు ఐదు కోట్ల రూపాయల సొమ్ము ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.అప్పటి టిడిపి నాయకుడు … ఎమ్యెల్యే రేవంత్ రెడ్డి .అడ్వాన్స్ గా 50 లక్షల రూపాయలను అందజేస్తూ … ఎసిబి ట్రాప్ లో కెమెరాల్లో రికార్డ్ అయి మరీ బుక్ అయ్యారు.ఈ ఎపిసోడ్ లో అసలు ట్విస్ట్ ఏంటి అంటే ఎపి సీఎం చంద్రబాబు ఫోన్ లో మావాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.ఆ తరువాత రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వైరం మరింత ముదిరింది.
ఒకానొక దశలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ కేసులో అరెస్ట్ అవ్వబోతున్నారు అంటూ… అప్పట్లోనే వార్తలు వచ్చి.కానీ అనూహ్యంగా….ఈ కేసు మరుగునపడింది.
అయితే ప్రస్తుత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ కేసు ను ఎన్ఫోర్సెమెంట్ అధికారులు స్పీడ్ చేయడం టీడీపీ లో మరింత టెన్షన్ పెంచుతోంది.రాబోయే పార్లమెంట్ ఎన్నికల ముందు, ఎపి అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ కి రంగం సిద్ధం అయ్యిందని భావిస్తున్న తరుణంలో ఈడీ ఈ కేసులో విచారణ మొదలు పెట్టేసింది.దాంతో అటు టి కాంగ్రెస్ లో వున్న రేవంత్ రెడ్డి, ఇటు టి.టిడిపి నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికే ఈ కేసులో వేం నరేందర్ రెడ్డిని ఈడీ కుమారుడితో సహా గంటల తరబడి విచారించేసింది.మరో నిందితుడు రేవంత్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది.అలాగే…కేంద్రంపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమైన బాబుకు ఈ కేసులో నోటీసులు అందినా ఆశ్చర్యపోనవసరంలేదు.అదే జరిగితే… ఈ కేసును రాజకీయంగా ఉపయోగించుకోవాలని టీడీపీ కూడా చూస్తోంది.