పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు.ఎవరి పరిస్థితి ఏ క్షణం ఏ మలుపు తిరుగుతుందో ఎవరు చెప్పలేము.
రాజకీయాల్లో ఉన్న నాయకుల పరిస్థితి అయితే అస్సలు ఊహించలేము.ప్రస్తుతం బాలయ్య చిన్నల్లుడు , లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ వ్యవహారం ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా ఉంది.
ఆయనకు చెందిన గీతం యూనివర్సిటీ లో అక్రమంగా, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని వైసీపీ ప్రభుత్వం తగిన ఆధారాలు సంపాదించడమే కాకుండా, అక్రమ నిర్మాణాలను ధ్వంసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.మొత్తం ఈ వ్యవహారం గీతం విద్యా సంస్థలకు ఇది పెద్ద తలనొప్పి వ్యవహారమే.2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన శ్రీభరత్ ఘోరంగా ఓటమి చవి చూశారు.అసలు ఆ ఎంపీ టిక్కెట్ తెచ్చుకునేందుకు టిడిపిలో ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టిడిపి లోని ఓ వర్గం నాయకులు జనసేన ఎంపీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణకు సహకరించారని, భరత్ గుర్రుగా ఉంటూనే వస్తున్నారు.అంతకు ముందు నుంచే టిడిపి అధిష్ఠానం తీరుపై ఆయన అసహనం తో ఉంటూ వచ్చారు.
అసలు ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో ఎంతో గందరగోళం నడిచింది.ఇదిలా ఉంటే, వైసిపి మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పుడు గీతం యూనివర్సిటీలో ఆక్రమణల పై విమర్శలు చేయడమే కాకుండా, అసలు ఈ తప్పు అంతా టిడిపి అధినేత చంద్రబాబు అనే విషయాన్ని లేవనెత్తారు.
టిడిపి అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న భూములను ఎందుకు క్రమబద్ధీకరించుకోలేదనే విషయం ఆయన తెరమీదకు తెచ్చారు.శ్రీ భరత్ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరతారు అని అంత అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు సైతం ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు వెనకా, ముందు ఆలోచించడం తో ఆయన వైసీపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కనిపించారు.అయితే ఆ తర్వాత విశాఖ ఎంపీ స్థానాన్ని కేటాయించడం తో ఆ వ్యవహారం అక్కడితో సద్దుమణిగి పోయింది.
ప్రస్తుతం, గీతం యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారాలపై ఆషామాషీగా వదిలిపెట్టేలా కనిపించడం లేదు.దీంతో శ్రీభరత్ సైతం ఇప్పుడు వైసిపి దారి పడతారని కొత్త ప్రచారం ఊపందుకుంది.