దేశవ్యాప్తంగా సంచలనం అయిన విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన ఇప్పటికి ఆ ప్రాంత వాసులని భయపెడుతుంది.ముఖ్యంగా విషవాయువు ప్రభావం ఇప్పటికి చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర ఉంది.
అక్కడికి వెళ్లి ఉండాలంటే ఎలాంటి సమస్యలు వస్తాయో అని భయంతో స్థానికులు వణికిపోతున్నారు.అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి క్లియరెన్స్ లేదు.
ఇదిలా ఉంటే ప్రమాద సమయంలో విషవాయువు పీల్చి అస్వస్థతకి గురై 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఇక 554 మంది బాధితులు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.
వీరికి సాధారణ చికిత్సలే అందిస్తున్నారు.
అయితే చికిత్స పొందుతున్న బాధితులను ఇప్పుడు ఇతర సమస్యలు చుట్టుముడుతున్నాయి.
ఈ ఘటనలో బాధితులైన వారిలో 52 మంది చిన్నారులు ఉన్నారు.తాజాగా బాధితుల్లో కొందరికి ఒంటిపై బొబ్బలు వస్తుండగా, చిన్నారుల్లో జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు బయటపడుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది.
తొలుత శరీరంపై దురద, మంట పుడుతున్నాయి.ఆ తర్వాత చర్మం కమిలిపోయి బొబ్బలు వస్తున్నాయి.
దీంతో చర్మవ్యాధుల నిపుణులు వారికి చికిత్స అందిస్తున్నారు.మరికొందరు బాధితులు తాము ఆహారం తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారు.
దీంతో స్పందించిన వైద్యులు వారికి కిడ్నీ, కాలేయ పనితీరుకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు.ఇక విషవాయువులు పీల్చిన వారిలో చాలా మంది దీర్ఘ కాలిక రోగాలతో జీవితాంతం బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు.
అయితే ప్రభుత్వం బాధితులకి పరిహారంతో సరిపెట్టింది తప్ప పూర్తి స్థాయిలో రాబోయే రోగాలని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో శ్రద్ధ తీసుకోలేదని ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి.