ఏపీలో ప్రతిదీ రాజకీయ అంశాలకు ముడిపెడుతూ, రచ్చ రచ్చ చేస్తున్నారు.అధికార పార్టీ వైసిపికి క్రెడిట్ దక్కకుండా, టిడిపి మిగతా రాజకీయ ప్రత్యర్ధులు ప్రయత్నిస్తుండగా, అంతే స్థాయిలో వైసీపీ కూడా రాజకీయ ప్రత్యర్థులకు ప్రతి విషయంలోనూ పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది.
ముఖ్యంగా ఏపీ రాజధాని అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.గత టిడిపి ప్రభుత్వంలో అమరావతిని రాజధానిగా ప్రకటించగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ను రాజధానిగా చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ అంశంపై ఇప్పుడు ఏపీ రాజకీయం రచ్చరచ్చగా మారింది.ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎన్ని అవరోధాలు ఎదురైనా, వెనక్కి తగ్గకూడదనే సంకల్పంతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉండగా, ఏదో ఒక రకంగా విశాఖను పరిపాలన రాజధానిగా చేయకుండా అడ్డుకోవాలని టిడిపి, మిగతా రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ క్రమంలోనే విశాఖ చుట్టూ రాజకీయ అలజడులు అలుముకుంటున్నాయి.తాజాగా ఏపీ ప్రభుత్వం విశాఖలో గెస్ట్ హౌస్ ను 30 ఎకరాల స్థలంలో అన్నిరకాల సదుపాయాలతో నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది.గెస్ట్ హౌస్ నుంచి చూస్తే సముద్రతీరం కనిపించేలా, దేశంలోని మిగతా అన్ని అతిథిగృహాల కంటే ధీటుగా, సకల సౌకర్యాలతో నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.అయితే దీనిపైనే వైసిపి రాజకీయ, వ్యక్తిగత విమర్శలు మొదలుపెట్టారు.
ప్రస్తుతం గెస్ట్ హౌస్ ను నిర్మించ తలపెట్టిన ప్రాంతంలో బౌద్ధుల ఆనవాళ్లు ఉన్నాయని, వాటిని విధ్వంసం చేసి మరీ గెస్ట్ హౌస్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు గగ్గోలు చేస్తున్నాయి.అలాగే బుద్ధ సంఘాల ప్రతినిధులు సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ రచ్చ చేస్తున్నాయి.
ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం ఇప్పటి కే ఈ వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు.ఈ వ్యవహారం జగన్ నిర్ణయం అమలు కాకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు.
కాకపోతే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాంతానికి బౌద్ధులు మాన్యుమెంట్ గా భావించే తొట్లకొండ కు గెస్ట్ హౌస్ కు సంబంధం లేదని, కావాలని రాజకీయంగా ఇబ్బందులు పెట్టేందుకే ఈ విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు.అంతే కాదు విశాఖ అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటాం అంటే చూస్తూ ఊరుకోబోమని మంత్రి అవంతి శ్రీనివాస్ వంటి వారు గట్టిగానే ప్రతిపక్షాలకు హెచ్చరికలు చేస్తున్నారు.
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో విడిది చేసేందుకు స్టార్ హోటళ్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఖజానాకు చిల్లు పెట్టారని, ఇప్పుడు ఆ విధంగా కాకూడదు అనే ఏపీ ప్రభుత్వం గెస్ట్ హౌస్ నిర్మిస్తుందని చెబుతున్నాయి.ఇదే కాదు ప్రతి వ్యవహారంలోనూ ఇదే రకంగా అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలతో విశాఖ వాతావరణం వేడెక్కుతోంది.విశాఖను రాజకీయ ప్రకంపనలే చుట్టుముడుతూ అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.