సాధారణంగా చూపులేని వారిని చూస్తే కొందరు జాలి పడతారు.మరికొందరు చిన్న చూపు చూస్తారు.
కానీ, చూపులేకపోయినా అద్భుతాలు సృష్టించిన వారు ఎందరో ఉన్నారు.వైకల్యం వారిని ఎంత వెనక్కి లాగుతున్నా.
లెక్కచేయకుండా నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందడుగు వేస్తూ కోట్లాది మందిలో స్ఫూర్తిని రగిలించే వారెందరో మన మధ్యన ఉన్నారు.అలాంటి వారిలో తమిళనాడుకు చెందిన పాతికేళ్ల పురాణ సుందరి కూడా ఒకరు.
తన కళ్లతో లోకాన్ని చూడలేకపోయినా.అందరి కళ్లను తనవైపుకు తిప్పుకుంది ఈ పురాణ సుందరి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఇటీవల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ ఫలితాల్లో తమిళనాడులో మధురై ప్రాంతానికి చెందిన పురాణ సుందరి చూపులేకున్నా.ఎంతో కష్టపడి 286వ ర్యాంక్ సాధించి అందరి చేత శభాష్ అనిపించుకుంది.
వినికిడి ద్వారానే విషయాలను గ్రహించగల పురాణ సుందరి.కేవలం ఆడియో పాఠాలు విని సివిల్స్ లో ఉత్తీర్ణురాలైంది.అయితే వాస్తవానికి ఆడియో పాఠాలు దొరకడమే కష్టమైన కాలంలో ఆమెకు తల్లిదండ్రులు, స్నేహితులే అండగా నిలిచారు.పుస్తకాలను ఆడియో పాఠాల రూపంలో మలిచి సాయపడ్డారు.ఆ విధంగా ఎంతో కష్టపడిన పురాణ సుందరి చివరకు మంచి ర్యాంక్ సాధించి.ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అధికారిణి అవ్వబోతోంది.
చూపులేదని అందరి వలే విధిని తిడుతూ కాలం వెళ్లదీయకుండా.తన తలరాతను తానే మార్చుకుంది ఈ పురాణ సుందరి.
ఇక ఈమె సంకల్పం ముందు విధి సైతం తలవంచింది.కాగా, పురాణ సుందరి సివిల్స్ రాయడం ఇది నాలుగోసారి.
తన నాలుగో ప్రయత్నంలో ఆమె మెరుగైన ర్యాంకును అందుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది.