ఐసీసీ ప్రపంచ కప్ 2019 లో కోహ్లీ సేన టీమిండియా విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ టోర్నీ సెమీస్ కు కూడా బెర్త్ ను ఖాయం చేసుకున్న ఈ జట్టు ఫైనల్ కు చేరుకోవాలని ప్రతి ఒక్క అభిమాని కూడా ఎదురుచూస్తున్నాడు.
అయితే అంతా బాగానే ఉంది కానీ కెప్టెన్ కోహ్లీ మాత్రం తన దూకుడు గనుక తగ్గించుకోకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పటివరకు లీగ్ దశలో ఎనిమిది మ్యాచ్ లు ఆడిన టీమిండియా ఆరు విజయాలతో సెమీస్ బెర్తుని ఖాయం చేసుకోగా, ఇప్పుడు శనివారం నామమాత్రంగా శ్రీలంక తో తలపడనుంది.
అయితే ఈ మ్యాచ్ లో గనుక కోహ్లీ ఏమాత్రం క్రమశిక్షణ తప్పినా సెమీస్,ఫైనల్ కి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఎప్పుడూ కూడా మైదానంలో కాస్త దూకుడుగా ఉండే కెప్టెన్ కోహ్లీ ప్రపంచకప్లోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నాడు.
మొన్నా మధ్య అఫ్గానిస్థాన్తో ముగిసిన మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్ అప్పీల్ని తిరస్కరించడంతో సహనం కోల్పోయి ఏకంగా అతని మీదకి దూసుకెళ్లడం తో క్రమశిక్షణ చర్యల క్రింద కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడింది.దీనితో అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ని కూడా చేర్చాడు.
ఇప్పటికే కోహ్లీ ఖాతాలో ఒక డీ మెరిట్ పాయింట్ ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య రెండుకు చేరుకుంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనల ప్రకారం.రెండేళ్ల వ్యవధిలో ఒక క్రికెటర్ ఖాతాలో డీమెరిట్ పాయింట్ల సంఖ్య నాలుగుకి చేరితే.వెంటనే నిషేధం అమలులోకి రానుంది.
ఈ క్రమంలో కోహ్లీ శ్రీలంక తో జరగబోయే మ్యాచ్ లో గనుక క్రమశిక్షణ తప్పితే మాత్రం ఆ సంఖ్యా రెండు నుంచి నాలుగుకు చేరే అవకాశం ఉంటుంది.దీనితో ఇక కోహ్లీ పై వేటు తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.
మరి శనివారం జరగబోయే మ్యాచ్ లో కోహ్లీ ఎలా వ్యవహరిస్తాడో చూడాలి.