జంతువులు అంటే చాలా మందికి ఇష్టం.సిటీల్లో అయితే ఇంట్లో కుక్కను, పల్లెటూర్లలో పశువులను, కోళ్లను పెంచుకుంటూ ఉంటారు.
జూలో ఉండే జంతువులను ప్రభుత్వం చూసుకుంటుంది.ఎవరైనా జూకు వెళ్లినప్పుడు ఆ జంతువులను చూసి మురిసిపోతారు.
అందులోనూ మనిషిలాగే ఉండే కోతులు, చింపాజీలను చూసి తెగ ఆనందపడతారు.కొంతమంది జంతువులను అమితంగా ప్రేమిస్తారు.
ఇంకొందరు అసహ్యించుకుంటారు.తాజాగా ఓ మహిళ ఇలానే చింపాజీపై ప్రేమను పెంచుకుంది.
అయితే ఆమెను జూకు రావద్దంటూ సంస్థ నిషేధం విధించడం చర్చనీయాంశమవుతోంది.బెల్జియంలో ఉన్నటువంటి ఆంట్వెర్ప్ జూలో ఒక సందర్శకురాలిపై నిషేధం విధిస్తూ ఆ సంస్థ చర్యలు తీసుకుంది.
తనపై నిషేధం విధించడంతో ఆమె కన్నీటిపర్యంతమవుతోంది.ఈ జూకు నాలుగు సంవత్సరాల నుంచి ఏడీ టిమ్మర్ మన్స్ అనే మహిళ వస్తూ పోతోంది.
అయితే ఆమె జూకు వచ్చినప్పుడు 38 సంవత్సరాల మగ చింపాంజీ వద్దే ఎక్కువ సమయం గడిపేది.రోజూ ఇలా రావడం పట్ల ఆ చింపాంజీ ఆమెను బాగా గుర్తుపడుతూ ఆమెతో కాలక్షేపం చేయడం మొదలు పెట్టింది.
ఆ తర్వాత ఆ చింపాంజీ తనతో పాటు ఉన్న మిగిలిన చింపాంజీలతో ఉండటం మానేస్తూ వచ్చింది.ఆ మహిళ లేనప్పుడు అది ఒంటరిగా ఉండటంతో మిగిలిన చింపాంజీలు దాన్ని పట్టించుకోవడం మానేశాయి.
చింపాంజీలో ఈ విచిత్ర మార్పుకు కారణాన్ని జూ అధికారులు గుర్తించారు.ఆ చింపాంజీ అలా అవ్వడానికి కారణం ఏడీ టిమ్మర్ మన్స్ అనే ఆవిడ అని కనుక్కున్నారు.
చింపాంజీని తిరిగి మామూలుదాన్ని చేయడానికి ఆ మహిళను జూకు రావద్దని తేల్చి చెప్పారు.దీంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యింది.
చింపాంజీ అంటే తనకు ఎనలేని ఇష్టమని చెప్పినప్పటికీ ఆ జూ సిబ్బంది ఆమెను అనుమతించలేదు.దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమెకు మద్దతుగా చాలా మంది పోరాటం చేస్తున్నారు.
చింపాంజీని చూసేందుకు ఆమెకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.