గ్రామాల్లో చాలా కట్టడాలను ఏళ్ల కిందట నిర్మించి ఉంటారు.అవి ఎప్పుడు కూలిపోతాయో అని అందరూ భయంతో జీవిస్తున్నా కానీ కొన్ని ప్రదేశాల్లో అధికారులు, స్థానిక నాయకులు ఏ మాత్రం పట్టించుకోరు.
ఇలాంటి పరిస్థితి ఏ ఒక్క గ్రామంలోనో కాదు చాలా ప్రాంతాల్లో ఇటువంటి దుస్థితినే ప్రజలు ఎదుర్కొంటున్నారు.తాజాగా గుజరాత్ రాష్ర్టంలో 40 సంవత్సరాల కిందటి వాటర్ ట్యాంక్ ఒకటి కుప్పకూలింది.
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరో విచారకర విషయం ఏంటంటే ఎన్నడో కట్టిన పాత ట్యాంకు ద్వారానే ఆ గ్రామస్తులకు ఇప్పటికీ ఇంటింటికీ నీళ్లు అందుతున్నాయి.
ప్రభుత్వాలు పల్లెల రూపు మార్చడానికి ఎన్ని నిధులు ఖర్చు పెట్టినా చాలా ప్రాంతాల్లో సరైన వసతులు మెరుగు పడట్లేదనడానికి ఈ ట్యాంకు ఘటనే నిదర్శనం అని చాలా మంది అంటున్నారు.గుజరాత్ రాష్ర్టంలోని జునాఘడ్ కేశోద్ ప్రాంతం ఖీర్సారా గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది.
ఇలా వాటర్ ట్యాంక్ కింద పడినపుడు సంఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.ఎంతలా చెప్పినా, ఎన్నిసార్లు విన్నవించినా కూడా అధికారులు వాటర్ ట్యాంక్ ను పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు మండిపడుతున్నారు.
దాదాపు ఆ ట్యాంక్ పరిమాణం 1.5 లక్షల లీటర్ల సామర్థ్యం.ట్యాంక్ కిందకు నేలమట్టమైనపుడు ఎవరూ లేరు కాబట్టి సరిపోయిందని అదే ఎవరైనా ఉండి ఉంటే తీవ్రంగా ప్రాణ నష్టం సంభవించి ఉండేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ట్యాంక్ కూలినపుడు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండకూడదని కామెంట్లు చేస్తున్నారు.
ఇటువంటి ఘటనే ఇంతకు ముందు కూడా గుజరాత్ లో జరిగింది.