బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాను తూర్పు తీరంపై విరుచుకుపడింది.సముద్రం అల్లకల్లోలంగా మారింది.
తుఫాన్ ధాటికి ఒడిశా, బెంగాల్లో పలుచోట్ల భారీసంఖ్యలో ఇండ్లు, వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, టవర్లు నేలకొరిగాయి.ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహనాగా, రెమునాలో, భద్రక్ జిల్లా ధామ్రా, వాసుదేవ్పూర్లలో సముద్రం ముందుకొచ్చింది.
తుఫాన్ కారణంగా ఒడిశాలో ముగ్గురు, బెంగాల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.తుఫాన్ నేపథ్యంలో ఒడిశా 5.8 లక్షల మందిని, బెంగాల్ 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.తుఫాన్ కారణంగా రాష్ట్రంలో సుమారు కోటి మంది ప్రభావితమయ్యారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు.
దాదాపు మూడు లక్షల ఇండ్లు దెబ్బతిన్నాయని చెప్పారు.తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు రూ.10 కోట్ల విలువైన సహాయక సామగ్రిని తరలించినట్టు చెప్పారు.బెంగాల్లోని తూర్పు మేదినీపూర్లో ఉన్న దిఘా పూర్తిగా నీటమునిగింది.
సహాయక చర్యల కోసం ఆర్మీ సాయం కోరారు.పర్యాటక ప్రాంతాలైన మందర్మని, తేజ్పూర్, శంకర్పూర్లో హోటళ్లు, నివాస సముదాయాల్లోకి సముద్రపు నీరు చేరింది.సహాయక చర్యల కోసం ఆర్మీ 17 బృందాలను బెంగాల్కు తరలించింది.తుఫాన్ దాటికి పలు ప్రాంతాలు నీట మునగడంతో సముద్రంలోని మొసళ్లు, మానిటర్ బల్లులు వరదలో నుంచి కొట్టుకొచ్చి, ఇళ్ల ముందు దర్శనమిస్తున్నాయి.
ఇక తాజాగా కోల్కతా నగరంలోని దమ్ దమ్ ఏరియాలో మానిటర్ బల్లి తిరుగుతూ కనిపించింది.
ఈ మానిటర్ బల్లితో పాటు మొసళ్లు కూడా వరద నీటిలో అటుఇటు తిరుగుతుండటంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలను అటవీ శాఖ అధికారి ప్రవీణ్ అంగుసామీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.అది కాస్తా వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని, ఓ మానిటర్ బల్లితో పాటు ఓ మొసలిని పట్టుకున్నారు.
ప్రస్తుతం మానిటర్ బల్లి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.