రైతు లేనిది మానవుని జీవితానికి మనుగడ లేదు.ఈరోజు మనం నాలుగు ముద్దలు తింటున్నామంటే అది రైతు పడిన కష్టమే.
ఎన్నో కష్టాలు పడి వానలో తడుస్తూ, ఎండలో ఎండుతూ పంటను పండించడం వల్లనే మనం ఈరోజు హాయిగా ఇళ్లల్లో ఉంటున్నాము.అయితే, ఇంత కష్టపడుతున్న మన రైతన్నకి ఆపద వస్తే మాత్రం ఆదుకోవడానికి ప్రభుత్వాలు సైతం ముందుకు రావడం లేదు.
మనం నిత్యం కొనే కూరగాయల ధరలేమో మండిపోతున్నాయి.కానీ రైతుకు కనీస మద్దతు ధర దొరక్క రూపాయి కూడా మిగలడం లేదు.
నిజం చెప్పాలంటే మార్కెట్ లో వినియోగదారులకు లభించే ధరకు, రైతుకు అందే మద్దతు ధరకు అస్సలు సంబంధం లేదు.ఇటు రైతు, అటు వినియోగదారుడు ఇద్దరు నష్టపోతున్నారు.
కానీ, మధ్యలో ఉండే గుత్తేదారుడు మాత్రం లాభపడుతున్నాడు.ఏ మాత్రం కష్టపడకుండానే లక్షలు.
కోట్లు.సంపాదిస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఇప్పటికే మద్దతు ధర కోసం దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు.
కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ నేపథ్యంలో ఒక రైతు తాను ఎంతో పెట్టుబడి పెట్టి, కష్టపడి వేసిన క్యాబేజి పంటను తనంతట తానే ధ్వంసం చేసుకున్నాడు.ఎందుకు అనుకుంటున్నారా.? కారణం తెలిస్తే అతడు చేసిన పనిని సమంజసమే అంటారు.ఎందుకంటే.
అతడు పండించిన క్యాబేజీ పంటను ఒక్క రూపాయికే అమ్మమని అడిగారట మరి.ఇందుకు సంబంధించి బీహార్ లోని సమస్తీపూర్ జిల్లా ముక్తాపూర్ కు చెందిన ఓం ప్రకాశ్ యాదవ్ అనే రైతు తన పొలంలో క్యాబేజీ పంటను వేశాడు.లాభాలు వస్తాయని, బయటి నుంచి అప్పులు తెచ్చి మరి పంట పండించాడు.మార్కెట్ లో మంచి రేటు వస్తుందని ఆశించాడు.కానీ, తీరా పంట చేతికొచ్చే సమయానికి అంతా తారుమారు అయిపొయింది.దగ్గరలోని మండిలో క్యాబేజీ ధర కిలోకు ఒక్క రూపాయి మాత్రమే పలుకుతుంది.
ఆ రేటుకు పంటను అమ్ముకుంటే 5వేల రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు.అయితే అదే మార్కెట్లో కిలో క్యాబేజీ 10 నుంచి 30 వరకు రేటు పలుకుతుంది.
దాంతో ఆ రైతు మా దగ్గర రూపాయికి కొని.ప్రజలకు 30 రూపాయలకు అమ్ముతారా.? అని ఓం ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.తన పంటను రూపాయికి అమ్మే ప్రసక్తే లేదని.
అవసరమైతే ధ్వంసం చేస్తానని చెప్పి, ఆగ్రహాన్ని ఆపుకోలేక ట్రాక్టర్ తెచ్చి తన పొలంలోని క్యాబేజీ పంటను మొత్తం దున్నేశాడు.ఈసారి గోధుమ పంటను వేస్తానని, కనీసం ఈసారైన తన పంటకు మంచి రేటు వచ్చి.
తన అప్పులు తీరుతాయని ఆశతో ఉన్నాడు.ఇలా క్యాబేజీ పంటను నాశనం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు అయ్యో పాపం అని సానుభూతి చూపిస్తున్నారు.మనదేశంలో రైతు పరిస్థితి చూసి సానుభూతి చెప్పడం కన్నా మనం, మన ప్రభుత్వాలు చేసేది ఏమి లేదు కదా.