భారతదేశంలో ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ ప్రేమ వ్యవహారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.కొందరు కేటుగాళ్లు సూటు, బూటు వేసుకొని పెద్ద ఉద్యోగస్తులుగా బిల్డప్ ఇస్తూ ఆన్లైన్ లో గంటల తరబడి సమయం గడుపుతూ అమ్మాయిలను ట్రాప్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు.
ఐతే ఈ కేటుగాళ్ల మాటలను నమ్మి కొందరు ఆడవారు తమ మాన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.
సోషల్ మీడియాలో పరిచయమైన అజ్ఞాత వ్యక్తులతో హద్దులు దాటి మాట్లాడకూడదని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా కొందరు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తూ ప్రమాదాల్లో చిక్కుకుపోతున్నారు.
తెలిసీ తెలియని యుక్త వయసు అమ్మాయిలు కూడా మొబైల్ ఫోన్ లలో గంటల తరబడి సమయం గడుపుతూ కామాంధుల వాంఛకు బలవుతున్నారు.అవతలి వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా గుడ్డిగా నమ్మి వారిని స్వయంగా కలవడం అనేది ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని చెప్పేందుకు నిదర్శనంగా ఎన్నో ఘటనలు నిలుస్తున్నాయి.
కానీ ఇప్పటికీ ప్రతిరోజు ఎందరో మహిళలు ఇంటర్ నెట్ లో పరిచయమైన వారిని నమ్మి ఎఫైర్ల నడిపిస్తున్నారు.చివరికి మోసపోయి అప్రతిష్ట పాలవుతున్నారు.అయితే ఈ విషయంలో ప్రజలందరికీ అవగాహన కల్పించి సైబర్ నేరాలను గణనీయంగా తగ్గించాలన్న ఉద్దేశంతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఒక వీడియోని నెట్టింట షేర్ చేశారు.
ఒక నిమిషం 10 సెకండ్ల నిడివిగల ఈ అవేర్నెస్ వీడియోలో ఒక యువతి అజ్ఞాత వ్యక్తితో చాటింగ్ చేస్తూ ఉంటుంది.
తాను తన ప్రవేటు పార్టుపై ఒక టాటూ వేయించుకున్నానని కూడా చెబుతుంది.దీనితో అతడు ఆమెను టాటూ ఫోటో పంపించమని అడుగుతాడు.దీంతో ఆమె మాట్లాడుతూ.పరిచయం ఏర్పడి కేవలం రెండు వారాలే అవుతుంది కదా అని ప్రశ్నిస్తుంది.
కానీ అజ్ఞాత వ్యక్తి తీయటి మాటలు చెప్తాడు.దీనితో అతడిపై నమ్మి యువతి తన పర్సనల్ ఫోటోలు పంపిస్తుంది కానీ మరుసటి రోజే వీధుల్లో ఆమె పర్సనల్ ఫోటోలు పోస్టర్ రూపంలో ప్రత్యక్షమవుతాయి.
దీంతో ఆమె ఒక్క సారిగా షాక్ అవుతుంది.తన గురించి నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడుతుంటే ఆమె తలెత్తుకోలేకపోతుంది.
దీనితో ’బయట ఎక్కడా చేయని పనులను, ఇంటర్నెట్ లో కూడా చేయకూడదు‘ అనే నిర్ణయానికి వస్తుంది.అయితే అమ్మాయిలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఒక వీడియో పాట రూపొందించి మరీ చేస్తున్న ఈ వినూత్న ప్రయత్నానికి నెటిజన్ల నుంచి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.