మన చుట్టూ అనేకమంది పొట్ట నింపుకోవడానికి కాయాకష్టం చేస్తూ వుంటారు.మరోకొంతమంది ఇతరులు కష్టపడితే ఆ కష్టాన్ని ఎంజాయ్ చేస్తూ వుంటారు.
అలాంటివారి గురించి చెప్పాల్సిన పనిలేదు.అయితే తాజాగా ఓ వ్యక్తి ఆల్కహాల్ కిక్కు కోసం ఏకంగా గవర్నమెంట్ ఆస్తికి కన్నం వేసాడు.
ఒడిశాకు చెందిన ఒక గవర్నమెంట్ఆఫీస్ ప్యూన్ మందు తాగడానికి డబ్బులు లేక ఏకంగా మూతబడిన తన ఆఫీస్ ఫర్నీచర్, ఫైల్స్, కిటికీలు, తలుపులు అమ్ముకు తాగేశాడు.ఒడిశా స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ను బంగారు బాతులా మార్చుకున్న ఈ వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
ఎందుకు బాబు ఇలాంటివన్నీ చేసావు? అని అడిగితే, మందు తాగడానికి డబ్బులు లేనప్పుడల్లా ఇలా చేస్తున్నట్లు చెప్పడం గమనార్హం.వివరాల్లోకి వెళ్తే.
ఒడిశాలో 1948లో స్థాపించిన డిస్ట్రిక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ విభాగం, బెర్హంపూర్ నగరంలోని ఒక భవనం కేంద్రంగా పనిచేస్తోంది.ఇటీవల DI ఆఫీస్ పేరును డిస్ట్రిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఆఫీస్గా మార్చారు.
ఆ తర్వాత జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీస్ను రెండు సంవత్సరాల క్రితం కొత్త భవనానికి మార్చారు.దీంతో పాత ఆఫీస్ను మూసివేశారు.
అయితే పాత ఫైల్స్ అన్నీ అక్కడే ఉండటంతో, ఈ ఆఫీస్ పర్యవేక్షణ బాధ్యతలను ప్యూన్ M పీతాంబర్కు అప్పగించి, అతడిని వాచ్ అండ్ గార్డుగా నియమించారు.
ఇక అప్పటి నుంచి అధికారులు గానీ, సందర్శకులు గానీ పాత ఆఫీస్కు వెళ్లడం లేదు.అయితే కొన్ని పాత ఫైళ్ల కోసం ఇటీవల ఈ ఆఫీస్కు వెళ్లారు విద్యాశాఖ సెక్షన్ ఆఫీసర్ జయంత్ కుమార్ సాహు. లోపలికి వెళ్లిన జయంత్, ఆఫీస్ ఖాళీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.
అక్కడ ఉండాల్సిన పాత ఫైళ్లు, అల్మారాలు, ఫర్నీచర్ అన్నీ మాయమయ్యాయి.దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించి బెర్హంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు విచారణ సందర్భంగా కీలక వివరాలు రాబట్టారు బెర్హంపూర్ పోలీసులు.ఆఫీస్ ఫర్నీచర్ను వాచ్ గార్డు పీతాంబర్ అమ్ముకున్నట్లు గుర్తించి, శనివారం అతడిని అరెస్టు చేశారు.